Telangana : సంప్రదాయాలు, నమ్మకాలు భలే ఆసక్తిగా ఉంటాయి. వింతగా ఉన్నా వాటి వెనుక బోలెడంత విశ్వాసం ఉంటుంది. దశాబ్దాల తరబడి తమ పూర్వికులు పాటించిన ఆచారమే తమని కాపాడుతుందనే నమ్మకం ఇస్తుంది. ఇప్పటికీ అలాంటి సంఘటనలు అనేకం చూస్తూనే ఉంటాం. సమయానికి వానలు కురవక పోతే.. కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. అలా చేస్తే వాన దేవుడు కరుణిస్తాడనే నమ్మకం. వేప చెట్టుకు, రావి చెట్టుకు పెళ్లి చేస్తుంటారు. అవి మనల్ని చల్లగా చూస్తాయనే విశ్వాసం. ఇలాంటిదే మరో ఉదంతం ఇటీవల తెలంగాణలో జరిగింది. కాకపోతే అది కాస్త కొత్తగా ఉంది. ఇంతకుముందు అలాంటిది చూసిన సందర్భాలు తక్కువే. ఇంతకీ ఏం చేశారంటే..
భూమాతకు పూజలు..
ఇటీవల జగిత్యాల జిల్లాలో భూమి కంపించింది. కొన్ని క్షణాల పాటు భూకంపం వచ్చింది. తక్కువ తీవ్రతే కావడంతో అంతగా ప్రమాదమేమీ జరగలేదు. గోడలు, ఇంట్లోని వస్తువులు అదిరాయి. ఎప్పుడూ లేనిది ఇప్పుడిలా భూకంపం రావడంతో జిల్లా వాసులు బెదిరిపోయారు. భూమాతకు కోపం వచ్చిందని భావించిన కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామ వాసులు.. భూదేవిని శాంతింపచేసేందుకు ప్రత్యేక పూజలు చేశారు. బూరెలు, భక్షాలు నైవేద్యంగా పెట్టి.. అమ్మా శాంతించమ్మా అంటూ భూమాతను వేడుకున్నారు.
బూరెలు, భక్షాలు నైవేద్యం..
పూర్వం కాలంలో ఎప్పుడో భూమి కంపిస్తే.. తమ పూర్వికులు ఇలానే చేశారని ఆ గ్రామ పెద్దలు అంటున్నారు. భూదేవికి బూరెలు అంటే చాలా ఇష్టమని.. అందుకే వాటిని నైవేద్యంగా పెట్టి పూజలు చేస్తే అమ్మ శాంతిస్తుందని వారి నమ్మకం. గ్రామంలోని కొందరు మహిళలు బూరెలు చేసి.. గ్రామ శివారులో ఓ చెట్టు దగ్గర మట్టి తవ్వి చిన్న గుంత చేశారు. ఆ గుంతలో ముగ్గు చేసి, పసుపు కుంకుమ చల్లి.. దానిపై బూరెలు, భక్షాలు ఉంచి.. నైవేద్యంగా సమర్పించారు. అనంతరం పూజలు నిర్వహించి.. ఆ గుంతతో కొన్ని బూరెలు వేసి మట్టితో కప్పేశారు. గోతిలో పెట్టి పూడ్చగా మిగిలిన వాటిని ప్రసాదంగా స్వీకరించారు గ్రామస్తులు. మరోసారి భూకంపం రావద్దని భూమాతను వేడుకున్నామని చెబుతున్నారు. ఎవరి నమ్మకం వాళ్లది. భూదేవికి బూరెలు నైవేద్యంగా సమర్పించి.. మట్టిలో పాతిపెట్టడం మాత్రం కాస్త కొత్తగానే ఉందంటూ జిల్లా వ్యాప్తంగా ఈ సంప్రదాయం చర్చనీయాంశమైంది.
Also Read : భర్త లేని వారు బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే..