Dharma Sandehalu: బొట్టు అనేది భారతీయ సంస్కృతిలో చాలా లోతైన అర్థం ఉన్న ఆచారం. ఇది ఆధ్యాత్మికత, అందం, సామాజిక సందేశాలతో ముడిపడి ఉంటుంది. బొట్టు పెట్టుకోవడం వల్ల ఆజ్ఞా చక్రం ఉత్తేజితమవుతుందని, నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాక, ఈ రోజుల్లో భర్త లేని స్త్రీలు కూడా బొట్టు పెట్టుకోవచ్చనే ఆలోచన సమాజంలో విస్తరిస్తోంది. ఇది అపచారం అని కొందరు నమ్మితే, ఆదునికత అని మరికొందరు వాదిస్తారు. అసలు పెళ్లైన ఆడవారు బొట్టు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయంలో చాలా పాత చరిత్ర ఉన్న ఆచారం. ఇది స్త్రీల అందానికి ఆధ్యాత్మికతను జోడిస్తుంది. నీటి మధ్యలో, కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవడం ఆజ్ఞా చక్రంతో సంబంధం ఉందని చెబుతారు. ఈ ఆజ్ఞా చక్రం, లేదా ఆరవ చక్రం, మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఏకాగ్రతను, అంతర్దృష్టిని నియంత్రిస్తుందని యోగ శాస్త్రాలు చెబుతాయి. బొట్టు ఈ చక్రాన్ని ఉత్తేజపరిచి, మనస్సును శాంతపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, ఏకాగ్రతను పెంచడానికి సహాయపడుతుందని నమ్ముతారు.
ఆయుర్వేదం ప్రకారం, బొట్టు పెట్టుకోవడం వల్ల నీటి మధ్యలో ఉన్న సున్నితమైన నాడులు ఉత్తేజితమవుతాయి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. కుంకుమ, చందనం, విభూతి లాంటి సహజ పదార్థాలతో బొట్టు పెట్టుకుంటే, ఈ ప్రభావం మరింత బలంగా ఉంటుందని చెబుతారు. ఈ పదార్థాలు చర్మంతో సంబంధం కలిగినప్పుడు, శరీరంలోని శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తాయి.
భర్త చనిపోతే బొట్టు పెట్టుకోవద్దా?
పూర్వం బొట్టు అంటే పెళ్లైన ఆడవారి ఆచారంగా చూసేవారు. భర్త సుఖసంతోషాల కోసం, సౌభాగ్యం కోసం బొట్టు పెట్టుకునేవారు. అయితే భర్త చనిపోయిన వారు మాత్రం బొట్టు పెట్టుకోకూడదు, గాజులు, పూలు మెట్టెలు దరించకూడదని చాలా మంది అంటారు. గతంలో కొన్ని సాంప్రదాయ సమాజాల్లో వితంతువులు బొట్టు పెట్టుకోవడాన్ని పూర్తిగా నిషేధించే వారు. క్రమంగా ఇదే ఆచారం కొనసాగుతూ వస్తోంది. అయితే, భర్త చనిపోయిన ఆడవారు కూడా బొట్టు పెట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బొట్టు అనేది భర్తతో వచ్చినది కాదని, ఆడపిల్ల పుట్టినప్పుడే తల్లి బొట్టు పడుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు భర్త చనిపోయిన తర్వాత, భర్తతో పాటుగా బొట్టు కూడా ఆడపిల్ల జీవితంలో నుంచి పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అంతేకాకుండా భర్త చనిపోతే భార్య బొట్టు పెట్టుకోవడం ఆపేయాలని ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదని నిపుణులు చెబుతున్నారు.
ట్రెండ్ మారింది
ఈ రోజుల్లో పెళ్లైన స్త్రీలు, వితంతువులు కూడా బొట్టు పెట్టుకుంటున్నారు. బొట్టు కేవలం వివాహ స్థితిని సూచించే చిహ్నం కాదు; ఇది ఆధ్యాత్మికత, సంస్కృతి, వ్యక్తిగత విశ్వాసాలను చూపిస్తుందని నమ్మే వారు కూడా ఉంటారు. ఈ మార్పు స్త్రీల స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రోత్సహిస్తోందంటారు.