జగిత్యాల జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మునిసిపల్ పీఠాన్ని దక్కించుకునే క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఒకవైపు సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం, మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం మధ్య సాగుతున్న ఈ ‘లోపాయికారి’ యుద్ధం ఇప్పుడు బహిరంగ చర్చకు దారితీసింది. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకోవడం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది.
మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గంలో 14 మంది సభ్యులు గెలుపొందారు. తన బలాన్ని కాపాడుకునేందుకు సంజయ్ అప్రమత్తమయ్యారు. ప్రత్యర్థి వర్గం తమ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు, తన వర్గం అభ్యర్థులందరినీ హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించడం హాట్ టాపిక్గా మారింది.
అయితే, ఈ రాజకీయ చదరంగంలో ట్విస్టులు అక్కడితో ఆగలేదు. వార్డు నంబర్ 19, 23లకు చెందిన స్వతంత్ర అభ్యర్థులతో పాటు 17వ వార్డులో గెలిచిన జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కూడా అనూహ్యంగా సంజయ్ టీంలో చేరిపోవడం జీవన్ రెడ్డి వర్గానికి పెద్ద షాక్ ఇచ్చింది. తన సొంత అనుచరుడే ప్రత్యర్థి వర్గంలోకి వెళ్లడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రంగంలోకి దిగారు.
పరిస్థితిని గమనించిన జీవన్ రెడ్డి వెంటనే అప్రమత్తమై, తనకు మద్దతుగా ఉన్న 18 మంది అభ్యర్థులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. గెలిచిన వారంతా చేజారిపోకుండా ఉండేందుకు వారిని ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్లోని ఓ రహస్య క్యాంపుకు తరలించారు. ప్రస్తుతం ఇరు వర్గాలు తమ అభ్యర్థులను కాపాడుకోవడమే లక్ష్యంగా ‘క్యాంపు రాజకీయాలు’ నడుపుతున్నాయి.
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సంజయ్ కుమార్ వర్గంలో ఉన్న కొందరు కౌన్సిలర్లు లోలోపల జీవన్ రెడ్డితో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫోన్ల ద్వారా వారు సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు సంజయ్ వర్గంలో కలవరం పుట్టిస్తున్నాయి. అటు ఇటు మారుతున్న అభ్యర్థుల తీరుతో, అసలు మునిసిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అధికార పార్టీలో ఉన్న ఈ అంతర్గత విభేదాలు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఇలా కత్తులు దూస్తుండటంతో, అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి జగిత్యాల మునిసిపల్ పీఠం ఎవరికి దక్కుతుందో తెలియక అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సామాన్య ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.