తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకోగా.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని మొత్తం 2,995 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.
వార్డుల వారీగా విజయకేతనం
SEC గణాంకాల ప్రకారం, మొత్తం 2,995 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 1,537 వార్డులను కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ గణనీయంగా వెనుకబడి 781 వార్డులకే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ 336 వార్డుల్లో విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఇక ఎంఐఎం (MIM) 70 చోట్ల, సీపీఎం (CPM) 13, బీఎస్పీ (BSP) 2 వార్డుల్లో గెలుపొందగా, ఇతరులు 73 చోట్ల, స్వతంత్ర అభ్యర్థులు 183 వార్డుల్లో విజయం సాధించారు.
ఓట్ల శాతం.. ఎవరికి ఎంత?
ఓట్ల శాతం పరంగా చూస్తే కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఆ పార్టీకి మొత్తం 15,05,000 ఓట్లు లభించాయి. అంటే పోలైన ఓట్లలో 39.80 శాతం ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల ఓట్లతో 28.75 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ 5,92,823 ఓట్లు (15.67%) పొంది తన ఓటు బ్యాంకుని పెంచుకుంది.
ప్రజాభిప్రాయం స్వతంత్రుల వైపు కూడా మొగ్గు చూపడం విశేషం. ఇండిపెండెంట్లకు 3,14,000 ఓట్లు (8%) వచ్చాయి. ఎంఐఎం పార్టీకి 1,24,000 ఓట్లు (3.28%) రాగా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీకి 57,129 ఓట్లు (1.51%) లభించాయి.
కాంగ్రెస్ జోరుకు కారణాలివేనా?
పట్టణ ఓటర్లు ఈసారి మార్పు కోరుకున్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకర్షించాయి. బీఆర్ఎస్ కొన్ని కీలక స్థానాలను నిలబెట్టుకున్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో పట్టు కోల్పోవడం గమనార్హం. మరోవైపు.. బీజేపీ తన ఓటు శాతాన్ని మెరుగుపరుచుకుంటూ భవిష్యత్తులో ప్రధాన శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేసుకుంది.
ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. మున్సిపల్ పీఠాలను దక్కించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏకపక్ష విజయాన్ని నమోదు చేయడంతో కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ALSO READ: Srinivas Goud: కాంగ్రెస్ ప్రభుత్వం పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ..?