Jangaon Collector: అధికారులు ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా (Rizwan Basha) షేక్ సూచించారు. ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కలెక్టరెట్లో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. తెలంగాణ మున్సిపాలిటీలు చట్టం, 2019 మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, పోలింగ్ విధానాలపై మాస్టర్ ట్రైనర్లు సంపూర్ణ అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారి పూర్తి బాధ్యతలు అధికారాలు తెలుసుకోవాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్ ఒక మార్గదర్శక పుస్తకమన్నారు. ఎన్నికల చట్ట నిబంధనలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు.
బ్యాలట్ బాక్సులను తెరవడం, మూసివేయడం, సీలింగ్, భద్రపరచడం, బ్యాలట్ పేపర్ల జారీ, నిర్వహణ, లెక్కల తయారీ, ఓటరు గుర్తింపును రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన గుర్తింపు పత్రాల ఆధారంగా మాత్రమే నిర్ధారించాల్సిన విధానం, ఇండెలిబుల్ ఇంక్ వినియోగం ద్వారా ద్వంద్వ ఓటింగ్ నివారణ, ఓటు గోప్యత పరిరక్షణ క్యూల నియంత్రణ, మార్క్డ్, ఓటరు జాబితా, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ, బ్యాలట్ పేపర్ అకౌంట్ వంటి చట్టబద్ధ రికార్డుల సరైన నిర్వహణ పోలింగ్ ప్రారంభం, పోలింగ్ కొనసాగింపు, పోలింగ్ ముగింపు అనంతర ప్రక్రియలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు.
తక్కువ వయస్సు అనుమానం ఉన్న ఓటర్లు, కౌంటర్ఫాయిల్పై సంతకం చేయని సందర్భాలు, పోలింగ్ ముగింపు సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు అనుసరించాల్సిన విధానాలని పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులు తెలుసుకోవాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని జనరల్ ఆబ్జర్వర్ నరసింహారెడ్డి పర్యవేక్షించి, పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతత్వం, క్రమశిక్షణ మరియు చట్టపాలన తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో జనగామ, స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కమిషనర్ లు మహేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణ పాల్గొన్నారు.