సాగునీరు అందక కళ్లముందే పంట ఎండిపోతుంటే, ఆ ఆవేదన తట్టుకోలేక ఒక రైతు జిల్లా అత్యున్నత అధికారి కాళ్లపై పడ్డ ఘటన జనగామలో కలకలం రేపింది. విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో.. విధిలేక కలెక్టర్ వద్ద తన గోడు వెళ్లబోసుకున్నాడు.
జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన రవి అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ సుమారు 15 రోజుల క్రితం కాలిపోయింది. ప్రస్తుతం సాగు సీజన్ కావడంతో పంటకు నీరు పెట్టడం అత్యవసరమైంది. ట్రాన్స్ఫార్మర్ పని చేయకపోవడంతో మోటార్లు నడవక, పొలం బీటలు వారుతోంది. చేతికి అందాల్సిన పంట కళ్లముందే ఎండిపోతుండటంతో రవి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
అధికారుల నిర్లక్ష్యం.. రైతు ఆవేదన
ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేయించాలని లేదా కొత్తది ఏర్పాటు చేయాలని రైతు రవి గత పదిహేను రోజులుగా విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. పలుమార్లు విన్నవించుకున్నా అధికారులు కనికరించలేదు. రేపు మాపు అంటూ కాలయాపన చేయడంతో రైతులో అసహనం, నిస్సహాయత పెరిగిపోయాయి. అధికారుల నిర్లక్ష్యం తనను నిలువునా ముంచుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం జనగామ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ భాషాను కలిసిన రైతు రవి, తన గోడును వెళ్లబోసుకున్నాడు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని చెప్తూ, ఒక్కసారిగా కలెక్టర్ కాళ్లపై పడి కన్నీరు పెట్టుకున్నాడు. ‘అయ్యా.. నా పొలం ఎండిపోతోంది, దయచేసి ట్రాన్స్ఫార్మర్ ఇప్పించి నన్ను ఆదుకోండి’ అంటూ వేడుకున్నాడు. ఒక రైతు అలా కలెక్టర్ కాళ్లపై పడటంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
కలెక్టర్ స్పందన…
రైతు ఆవేదనను చూసి చలించిపోయిన కలెక్టర్ రిజ్వాన్ భాషా వెంటనే స్పందించారు. రైతును ఓదార్చి, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రైతు సమస్యను తక్షణమే పరిష్కరించాలని, యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.
ఈ ఘటనతోనైనా క్షేత్రస్థాయిలో విద్యుత్ అధికారులు స్పందించి, రైతుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని రైతాంగం ఆశిస్తోంది.
ALSO READ: Telangana Government: ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ఎట్టకేలకు రూ.713 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల
కలెక్టర్ కాళ్లపై పడ్డ రైతు.. పొలం ఎండిపోతోందని ఆవేదన!
జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన ఒక రైతు ఆవేదన కలచివేసింది. 15 రోజులుగా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేక పొలం ఎండిపోతుండటంతో, గత్యంతరం లేక కలెక్టరేట్కు చేరుకున్నాడు. అక్కడ జిల్లా… pic.twitter.com/SaLFhhAhmq
— ChotaNews App (@ChotaNewsApp) December 31, 2025