Jawahar Nagar: స్వేచ్ఛ బ్యూరో: జవహర్ నగర్ డంప్ యార్డ్ తో పరిసర ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఓ ప్రయత్నం మొదలైనట్లు చెప్పవచ్చు. ఇప్పటికే ఈ అంశంపై రెండు రోజుల క్రితం ఎంఎంసీ కమిషనర్ టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించిన సంగతి తెల్సిందే. అఖిల పక్షం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా ప్రతినిధులు, అధికారులు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ప్లాంట్ వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
కాలుష్య నియంత్రణచర్యలపై వివరాలు
ఈ సందర్భంగా రామ్కీ సంస్థ అనుసరిస్తున్న వ్యర్థ నిర్వహణ విధానాలు, కాలుష్య నియంత్రణ చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. జవహర్ నగర్ ప్రాంతంలో నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన ఎస్టీపీ ప్లాంట్ సక్రమంగా పనిచేయకపోవడంపై ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రామ్కీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్ ) నిధులను స్థానిక ప్రజల అభివృద్ధికి వినియోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించారు.
దీర్ఘకాలిక పరిష్కారం
ప్రస్తుతం చాలా తక్కువ మొత్తంలోనే సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నారని, దాని వల్ల ప్రజలకు తాగునీరు, సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి రోజుకు సుమారు 10 వేల మెట్రిక్ టన్నుల చెత్త జవహర్ నగర్ డంప్యార్డ్కు తరలివస్తుండడంతో సమస్య తీవ్రంగా మారిందని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. దీనికి దీర్ఘకాలిక పరిష్కారంగా హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా కొత్త డంప్యార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నాలుగు చెత్త డంపింగ్ యార్డులు
నాలుగు చెత్త డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయడం ద్వారా నగరంలో ఉత్పత్తయ్యే చెత్త జవహర్ నగర్ డంప్ యార్డుకు రావడం తగ్గుతుందని అధికారులు వివరించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, రామ్కీ సంస్థ ప్రతినిధులు కలిసి మరోసారి సమావేశమై సమగ్ర నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి, మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ క్రిష్ణా రెడ్డి, మల్కాజ్ గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, అదనపు కమిషనర్ (శానిటేషన్ ) రఘుప్రసాద్, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్య, రాగిడి లక్ష్మారెడ్డి, యాంటీ డంప్ యార్డ్ జేఏసీ సభ్యులు, రాంకీ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.
Also Read: నాగన్పల్లిలో విషాదం.. వడదెబ్బకు 8 ఏళ్ల చిన్నారి బలి