జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం రేపే వార్త ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోస్తూ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచిన తనకు ప్రస్తుత ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 25వ తేదీన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. తనను సంప్రదించకుండానే ప్రత్యర్థిని పార్టీలోకి ఆహ్వానించడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో తనకు దక్కాల్సిన కనీస గౌరవం మర్యాదలు కరువయ్యాయని ఆయన తన ఆత్మీయుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం సంజయ్ కుమార్కే ప్రాధాన్యత ఇస్తుండటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గౌరవం లేని చోట కొనసాగడం కంటే బయటకు రావడమే ఉత్తమమని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే తన అనుచరులు ముఖ్య నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల అభిప్రాయాలను సేకరించిన అనంతరం రాజీనామా నిర్ణయాన్ని ఖరారు చేసుకున్నట్లు వినికిడి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అగ్రనేతలతో ఆయన టచ్లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇప్పటికే ఆయన మంతనాలు పూర్తి చేశారని సమాచారం.
బీఆర్ఎస్ పార్టీలోకి ఆయనను ఆహ్వానించేందుకు గులాబీ బాస్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న జీవన్ రెడ్డి చేరికతో పార్టీకి పూర్వవైభవం వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈనెల 25న భారీ బహిరంగ సభ లేదా మీడియా సమావేశం ద్వారా తన భవిష్యత్ కార్యాచరణను జీవన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నేతను బుజ్జగించేందుకు అధిష్టానం చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి.
AALSO READ: CM Revanth Reddy: నిరంతర జలధారగా మూసీ నది.. 20 టీఎంసీల గోదావరి నీటితో భారీ ప్రాజెక్టు!