జగిత్యాల రాజకీయాల్లో సంచలనం రేపుతూ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయనను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జరిపిన చర్చలు పూర్తిగా విఫలమైనట్టు సమాచారం.. జీవన్ రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మంత్రులు ఆయనను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా రంగంలోకి దిగి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అధిష్ఠానంతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే జీవన్ రెడ్డి మాత్రం మంత్రుల ప్రతిపాదనలను నేరుగా తిరస్కరించినట్టు సమాచారం. తన ఆత్మగౌరవానికి భంగం కలిగిన చోట కొనసాగలేనని స్పష్టం చేస్తూ పార్టీ మార్పు విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
చర్చల సందర్భంగా జీవన్ రెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన తనకు తగిన గుర్తింపు లభించడం లేదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పార్టీ మారే విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశానని మంత్రులకు ముఖం మీదే చెప్పారు. అధిష్ఠానంతో చర్చలు జరపడానికి కూడా ఆయన ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఫోన్ ద్వారా హైకమాండ్ పెద్దలతో మాట్లాడాలని శ్రీధర్ బాబు సూచించినా ఆయన నిరాకరించారు.
జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. మంత్రుల రాయబారం ఫలించకపోవడంతో ఆయన తదుపరి అడుగు ఎటువైపు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన అనుచరులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ నాయకుడి నిష్క్రమణ జిల్లాలో పార్టీ ఉనికిపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జీవన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే.. దీనిపై మరింత క్లారిటీ రానుంది.
ALSO READ: Rythu Bharosa: రైతు భరోసా అప్లికేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. త్వరగా ఇలా అప్లై చేసుకోండి.!