బీఆర్ఎస్ పార్టీ రోజుకో కొత్త అంశాన్ని తెరమీదకు తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని అనుకున్న ప్రతిసారీ ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నట్టు తెలుస్తున్నది. మొన్నటివరకు కృష్ణా నదీ జలాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు కార్నర్ చేశారు. ఈసారి ఎలాగైనా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి ప్రజల్లో మైలేజ్ కొట్టేయాలని భావించగా.. ప్రభుత్వం బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తు వేయడంతో గులాబీ ఒక్కసారిగా డీలా పడిపోయినట్టు చర్చ జరిగింది. మాజీ సీఎం కేసీఆర్ నదీ జలాలపై రేవంత్ ప్రభుత్వం ఆంధ్రాకు సహకరిస్తూ తెలంగాణను ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నదని, దీనిపై బహిరంగ సభలు నిర్వహించి ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించినా ఇప్పటివరకు చర్యలు శూన్యమని విమర్శలొస్తున్నాయి.
ఇక నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపించి భూమి కన్వర్షన్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైనా బీఆర్ఎస్ పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల కుంభకోణానికి రేవంత్ సర్కార్ తెరలేపిందని విషప్రచారం చేసినట్టు మంత్రులు ఆరోపించారు. వాస్తవానికి భూముల కన్వర్షన్ అనేది స్వచ్ఛందం మని ఎవరైతే ముందుకు వస్తారో వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందజేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఏకంగా మంత్రి క్లారిటీ ఇవ్వడంతో బీఆర్ఎస్ వేసిన ఎత్తులు మరోసారి తలకిందులయ్యాయి.ఇక హిల్ట్ పాలసీని క్లీన్ ఎన్విరాన్ మెంట్ కోసమే తీసుకొచ్చామని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని చివరకు మంత్రి స్పష్టం చేయగా.. ఆ టాపిక్ను బీఆర్ఎస్ వదిలేయకతప్పలేదు.
తాజాగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను తమ పోరాట ఎజెండాగా పెట్టుకున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. ఏడాదిగా నోటిఫికేషన్లు లేవని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు ఇటీవల పెద్దఎత్తున ధర్నాలు, నిరసనలు తెలిపారు. అది కాస్త ఉధృతం కావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్ల వద్ద వారిని పరామర్శిస్తూ సరికొత్త రాజకీయానికి తెరలేపారని అధికార వర్గాల్లో టాక్ వినిపిస్తున్నది. నిరుద్యోగులే ప్రధాన అస్త్రంగా ప్రభుత్వంపై విరుచుక పడాలని, సర్కారు మీదకు నిరుద్యోగులను తోయాలని గులాబీ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ క్రమంలోనే నిరుద్యోగులతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రకటించిన దాన్ని కేటీఆర్ గుర్తుచేస్తున్నారు. ఎన్నికల ముందు అశోక్ నగర్ వచ్చిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం రోడ్ల మీదకు వస్తే పోలీసుల లాఠీలతో కొట్టిస్తారా? ఈ మేరకు ఆదేశాలిస్తారా? అని ప్రశ్నించడంపై రాష్ట్ర మంత్రులు గరం అవుతున్నారు. గత పదేండ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది? ఎంత మందికి ఉపాధి కల్పించింది? గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో అవకతవకలు, అనర్హులకు ఉద్యోగాలు ఎలా వచ్చాయని.. ఇవన్నీ మర్చిపోయారా? అని మంత్రి శ్రీధర్ బాబు కేటీఆర్, హరీశ్ రావులకు కౌంటర్ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగుల మరణాలకు బీఆర్ఎస్ పార్టీనే కారణమని స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. కాగా, త్వరలోనే జాబ్ క్యాలెండర్ వేస్తామని మంత్రి శ్రీధర్ బాబు నిరుద్యోగులకు భరోసానిచ్చారు.