Jubilee Hills Results: ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ముందు నుంచీ అందరూ ఊహించిన విధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. ఏ దశలోనూ బీజేపీ పోటీ ఇవ్వలేకపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అనూహ్యంగా డిపాజిట్ కోల్పోయారు.
ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 21 వేల ఆధిక్యంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెనుకంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి కేవలం 14243 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి ఏడో రౌండ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్ కేంద్రం బయట మీడియాతో మాట్లాడిన లంకల దీపక్ రెడ్డి.. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. కాంగ్రెస్ పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. చివరి మూడు రౌండ్లు బీజేపీకి అనుకూలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీహార్ లో ఎన్డీఏ ఘనవిజయం దిశగా దూసుకుపోతుంది. అయితే జూబ్లీహిల్స్ ఫలితాలతో తెలంగాణ బీజేపీలో ఆ జోష్ కనిపించడంలేదు. జూబ్లీ ఓటమితో బీజేపీ కేడర్ నిరుత్సాహంలో ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం డిపాజిట్ వస్తుందని బీజేపీ కార్యకర్తలు భావించారు. కానీ డిపాజిట్ గల్లంతు అవ్వడంతో సంబరాలకు కాస్త దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ విజయంతో ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఆఫీస్ వద్ద సంబరాలు మొదలుకావాల్సి ఉండగా.. ఆ జోష్ కనిపించడంలేదు.
Also Read: Jubilee Hills: ఇది చిన్న అంశం… ఒరిగేదేమీ లేదు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కవిత కీలక వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్ లో తాము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదని గుర్తుచేశారు. తాము ఉన్నంతలో ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని ఆరోపించారు.