Jubilee Hills: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై తాజాగా స్పందించారు. ఉప ఎన్నిక అంశాన్ని ఆమె ‘చిన్న అంశం’ గా కొట్టిపారేశారు. ఉప ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపదని, గెలుపు ఓటముల వల్ల ఒరిగేదేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. మెదక్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎవరు గెలిచినా, ఓడినా ఫలితం శూన్యం..
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక శాసనసభ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన ఎన్నిక. రాష్ట్రంలో మెజారిటీ ప్రభుత్వముంది. ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా రాష్ట్ర రాజకీయాలపై కానీ, ప్రభుత్వంపై కానీ ఎలాంటి ప్రభావం చూపదు. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే సీటు మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా చిన్న అంశంగా చూడాలి’ అని కవిత అన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితంపై అనవసరమైన హైప్ సృష్టించాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రజలు పెద్ద ఎన్నికలవైపే దృష్టి సారించాలి..
ప్రజలు ఉప ఎన్నికలకు కాకుండా, దేశ అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి దోహదపడే పెద్ద ఎన్నికల వైపు దృష్టి సారించాలని కవిత ఈ సందర్భంగా సూచించారు. ‘స్థానిక ఎన్నికలు, ఉప ఎన్నికలు సహజంగా జరుగుతుంటాయి. కానీ, అసలైన ప్రజా తీర్పు దేశ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే సాధారణ ఎన్నికల ద్వారానే తెలుస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక సాంప్రదాయక ప్రక్రియలో భాగమే తప్ప, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే అంశం కాదని ఆమె తేల్చి చెప్పారు. ఉప ఎన్నిక ఫలితంపై ఆమె ఇచ్చిన ఈ రియాక్షన్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Telangana Local Body Elections: కాంగ్రెస్ జోరు.. మరింత హుషారుగా స్థానిక పోరుకు తయారు