ఎన్నికల ప్రచారంలో ఎక్కడలేని గాంభీర్యం ప్రదర్శించారు కేటీఆర్. కేసీఆర్ కూడా తాను ప్రచారానికి రాకపోయినా పర్లేదు అన్నట్టుగా వ్యవహరించారు. కానీ జూబ్లీ హిల్స్ ఫలితం బీఆర్ఎస్ కి మరో గుణపాఠం చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఈ వరుస గుణపాఠాలతో అయినా బీఆర్ఎస్ గ్రౌండ్ రియాల్టీని అర్థం చేసుకుంటుందేమో చూడాలి.
బీఆర్ఎస్ కి ఏమైంది?
మీ మద్దతు ఉంటేనే మేం గెలుస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని అడగడం వేరు.. మేం గెలిచేస్తున్నాం, మీరు మాకు ఓటు వేయండి అని అడగడం వేరు. బీఆర్ఎస్ రెండో విధానాన్ని ఎంచుకుంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమే కాదనలేం. అక్కడ ఎమ్మెల్యే మరణంతో సింపతీ ఉండొచ్చు అది కూడా కాదనలేం. ఎమ్మెల్యే భార్యకే టికెట్ ఇచ్చి ఆ సింపతీని మరింతగా ఒడిసిపట్టే ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు కాదనలేం. కానీ జనం మరీ అంత అమాయకులా? అందుకే బీఆర్ఎస్ కి మరోసారి గట్టిగా గుణపాఠం చెప్పారు. ఇకనైనా మారండి అని మరో లెసన్ నేర్పారు.
పశ్చాత్తాపం లేదా?
పరాజయం తర్వాత సహజంగా ఎవరైనా పశ్చాత్తాప పడతారు, తప్పొప్పులు సరిదిద్దుకుంటారు. కానీ 2023 తర్వాత బీఆర్ఎస్ లో అది ఏ కోశానా కనపడలేదు. పైగా ప్రజలు కాంగ్రెస్ ని తప్పుడా అర్థం చేసుకున్నారని, లేనిపోని హామీలతో మోసపోయారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా ఎందుకు గెలిపించుకోలేదా అని ప్రజలు బాధపడుతున్నారంటూ కథలు చెప్పుకొచ్చారు. ఆ కథలతో కనీసం లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలుచుకున్నారా అంటే అదీ లేదు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు జాతీయ పార్టీలవైపు మొగ్గు చూపారంటూ అక్కడ మరో కారణం చెప్పుకున్నారు. పోనీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లే ఏం జరిగింది? సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది. 2014, 2019, 2023 లో వరుసగా జూబ్లీహిల్స్ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు స్థానికులు ఎందుకు ఓట్లు వేయలేదు. కారణాలు చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్ వారి కొంప ముంచిందని అర్థమైంది.
ఇకనైనా మారతారా?
ప్రజలెప్పుడూ అమాయకులు కాదు, ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని అధికారంలో కూర్చోబెట్టాలనేది వారికి బాగా తెలుసు. ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు వాళ్లే పాలిస్తారని కూడా తెలుసు. అన్నీ తెలిసి కాంగ్రెస్ కి ఓటు వేశారంటే బీఆర్ఎస్ ని పక్కన కూర్చోబెట్టారనేకదా అర్థం. అంతలోనే ఏదో జరిగిపోయినట్టు, ప్రజలు తప్పు చేసి పశ్చాత్తాప పడినట్టు బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో చెప్పడం పార్టీకే నష్టం చేకూర్చింది. మొన్న లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే రుజవైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మరోసారి స్పష్టమైంది.
బీఆర్ఎస్ ఏం చేయాలి?
ఇకనైనా ప్రజా తీర్పుని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. కేవలం తాము మాత్రమే జనాల్ని ఉద్ధరిస్తామనుకునే పిచ్చి భ్రమల్లోనుంచి బయటపడాలి. తెలంగాణ అంటే బీఆర్ఎస్ మాత్రమేననే అతివాదాన్ని పక్కనపెట్టాలి. గ్రౌండ్ రియాల్టీ తెలుసుకున్నప్పుడే కనీసం భవిష్యత్ లో అయినా ప్రజలు బీఆర్ఎస్ ని లెక్కలోకి తీసుకుంటారు. ఆ వాస్తవం తెలుసుకోకుండా వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే మాదేనంటూ రెచ్చిపోతే ఇలాంటి ఉప ఎన్నికలతో పదే పదే హెచ్చరిస్తుంటారు ప్రజలు.
Also Read: రేవంత్ నాయకత్వానికి ఢోకా లేనట్టే
Also Read: కాంగ్రెస్ జోరు.. మరింత హుషారుగా స్థానిక పోరుకు తయారు