Nepali Gang Arrest: పక్కా స్కెచ్ ప్రకారం పారిశ్రామిక వేత్త ఇంటి నుంచి లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలను చోరీ చేసి ఉడాయించిన నేపాలీ గ్యాంగులోని కీలక సభ్యురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుని కోసం వేటను ముమ్మరం చేశారు. ఇప్పటికే నేపాల్ పారిపోయినట్టుగా అనుమానాలు ఉన్న నేపథ్యంలో అతన్ని పట్టుకోవటానికి ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ వాస్తవ్యుడైన రవీంద్ర శర్మ పారిశ్రామిక వేత్త. గత నెలలో అతని ఇంట్లో నేపాల్ కు చెందిన భూపేంద్ర షాహీ ఎలియాస్ భువన్ వంట మనిషిగా ఉద్యోగంలో చేరాడు. నమ్మకంగా పని చేస్తున్నట్టుగా నటించి విలువైన బంగారు ఆభరణాలు, నగదును ఎక్కడ భద్రపరుస్తున్నారన్నది తెలుసుకున్నాడు.
ఆ తరువాత దొంగతనం చేయటానికి అవకాశం కోసం ఎదురు చూడటం మొదలు పెట్టాడు. ఇటువంటి పరిస్థితుల్లో రవీంద్ర శర్మ కుటుంబం అంతా బయటకు వెళ్లినపుడు భువన్ తను వేసుకున్న ప్లాన్ ను అమలు చేశాడు. తన పుట్టిన రోజు అని చెప్పి రవీంద్ర శర్మ ఇంట్లో పని చేస్తున్న మిగితా వారికి మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ తాగించాడు. అప్పటికే తన సహచరులైన నేపాల్ దేశానికే చెందిన కృష్ణ చాంద్, రమేశ్ ని అక్కడికి పిలిపించుకున్నాడు. కూల్ డ్రింక్ తాగిన వారు మత్తులోకి వెళ్లగానే ఈ ఇద్దరు ఇంట్లోకి చొరబడ్డారు. ఓ వాచ్ మెన్ కూల్ డ్రింక్ తాగక పోవటంతో అతన్ని తాళ్లతో కట్టేసిన ముగ్గురు నోరు తెరిస్తే చంపేస్తామని కత్తులతో బెదిరించారు. అనంతరం ఇంట్లోని బీరువా తెరిచి 1.30 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు నగలు, వజ్రాలు తస్కరించి కారులో అక్కడి నుంచి ఉడాయించారు.
ఈ చోరీ తీవ్ర కలకలం సృష్టించిన నేపథ్యంలో ఇటు జూబ్లీహిల్స్ పోలీసులతోపాటు అటు టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిందితులను పట్టుకోవటానికి వేట మొదలు పెట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి భారత్.. నేపాల్ సరిహద్దుల్లో మాటు వేశారు. ఈ క్రమంలో దేశం దాటటానికి ప్రయత్నించిన భువన్, కృష్ణ చాంద్ లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ఇద్దరు వెల్లడించిన వివరాల మేరకు వీరికి ముంబయిలో ఆశ్రయం కల్పించిన నేపాల్ దేశానికే చెందిన లలిత్ కిషన్ సాయిని కూడా అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన నిందితులను విచారించినపుడు ఈ గ్యాంగుకు లీడర్ గా నేపాల్ దేశానికి చెందిన జీవన్ చాంద్ ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే 2021, అక్టోబర్ లో ఖైరతాబాద్ హిల్స్ కాలనీ నివాసి యజ్ఞ అగర్వాల్ అనే వ్యాపార వేత్త ఇంట్లో జరిగిన 80లక్షల విలువ చేసే వజ్రాభరణాల చోరీ కేసులో జీవన్ చాంద్ వాంటెడ్ గా ఉండటం. ఈ కేసులో ఖైరతాబాద్ పోలీసుల గాలింపు కొనసాగుతుండగానే జీవన్ చాంద్ మరో చోరీకి కూడా పాల్పడి నేపాల్ పారిపోయినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. రవీంద్ర శర్మ ఇంట్లో వంట మనిషిగా భువన్ ను పెట్టించింది కూడా జీవన్ చాంద్ అని పేర్కొన్నాయి.
Also Read: Manasa Varanasi : మిస్ ఇండియా మానస సినిమాలకు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఇదే..?
ఇక, అరెస్టు చేసిన నిందితులను విచారించినపుడు బవిసరా కడేల్ ఎలియాస్ దేవీ ఎలియాస్ సుస్మిత ఎలియాస్ భీమ్లా పలు కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న జీవన్ చాంద్ గర్ల్ ఫ్రెండ్ అని వెల్లడైంది. ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందం తాజాగా భీమ్లాను అదుపులోకి తీసుకుంది. విచారణలో హైదరాబాద్ లో సంపన్నులు నివాసముండే ప్రాంతాల్లో భీమ్లా రెక్కీ జరిపి ఎవరెవరి ఇళ్లల్లో పనికి మనుషులు అవసరం ఉన్నారన్న వివరాలను జీవన్ చాంద్ కు అందచేసేదని వెల్లడైనట్టు సమాచారం. దీని ఆధారంగా జీవన్ చాంద్ టార్గెట్ గా చేసుకున్న సంపన్నుల ఇళ్లల్లో తన మనుషులను వాచ్ మెన్ గానో…వంట మనిషిగానో ఉద్యోగాల్లో పెట్టించేవాడని తెలిసింది. దీని కోసం మ్యాన్ పవర్ కన్సల్టెన్సీల సహాయం తీసుకునే వాడని సమాచారం. ఇలా పనుల్లో చేరిన వారు పక్కాగా పథకం వేసి అవకాశం చిక్కగానే చోరీ చేసి ఆ వెంటనే నేపాల్ పారిపోయేవారని తెలిసింది.
సంచలనం సృష్టించిన కేసుల్లో వాంటెడ్ గా ఉన్న జీవన్ చంద్ కోసం ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులతోపాటు టాస్క్ ఫోర్స్ అధికారులు వేటను ముమ్మరం చేశారు. అయితే, ఇప్పటికే అతను నేపాల్ కు పారిపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీవన్ చంద్ ను పట్టుకోవటానికి ఇంటర్ పోల్ సాయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అతను పట్టుబడితే మరిన్ని సంచలనాత్మక కేసుల్లో మిస్టరీ వీడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.
Also Read: Manasa Varanasi : మిస్ ఇండియా మానస సినిమాలకు గ్యాప్ తీసుకోవడానికి కారణం ఇదే..?