Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు పార్టీ మారిన ఎమ్మెల్యేల చుట్టూనే తిరుగుతున్నాయి. ఆదివారం అనగా నవంబర్ 23 వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడువు ఇచ్చారు. దీంతో స్పీకర్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతోందని ఆసక్తికరంగా మారింది. వచ్చేవారంలో 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కీలక నిర్ణయం వెల్లడించనున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము పార్టీ మారడానికి ముమ్మాటికీ కేసీఆర్ కారణమని తేల్చేశారు.
పార్టీ ఫిరాయింపులపై కడియం హాట్ కామెంట్స్
తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ వచ్చేవారం కీలక నిర్ణయాన్ని వెలువరించనున్నారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు హాజరై తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇక మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలు. ఒకరు కడియం శ్రీహరి కాగా, మరొకరు దానం నాగేందర్. ఈ నేపథ్యంలో శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. పార్టీ మారే వ్యవహారంపై తన నిర్ణయం చెప్పేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు. అందుకు స్పీకర్ నుంచి సానుకూలంగా స్పందించారు. వచ్చేవారం ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.
తన రాజీనామాపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఓ ఛానెల్తో మాట్లాడిన ఆయన, వ్యక్తుల చుట్టూ రాజకీయాలు తిరగవని అన్నారు. స్పీకర్కు తాను ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నది చాలా సీక్రెట్ అని చెప్పారు. మొదటి నుంచి తాను ఒక్క మాట చెబుతున్నానని, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం గడిచిన 15 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గం ప్రజలకు అనేక హామీలు ఇచ్చానని, వాటిని నెరవేర్చాలంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వక్కానించారు.
బైపోల్కి ముమ్మాటికీ కేసీఆర్ కారణం-కడియం
కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేయడం వల్ల తన నియోజకవర్గానికి రూ. 1400 కోట్ల నిధులు వచ్చాయన్నారు. రోడ్లు, క్రికెట్ స్టేడియం, ఎకో టూరిజానికి సెంటర్గా మారుబోతోందన్నారు. నియోజకవర్గం తన ప్రాధాన్యత కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారని, అందులో మంత్రులు కూడా అయ్యారని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారని, సబితను మంత్రిగా చేశారన్నారు. పార్టీ మారినా డిస్క్వాలిఫై కాలేదన్నారు.
ALSO READ: బీఆర్ఎస్లో టెన్షన్ టెన్షన్.. కేటీఆర్ ఏ క్షణమైనా
పార్టీ ఫిరాయింపులకు మూల కారణం కేసీఆర్-బీఆర్ఎస్ అని కుండబద్దలు కొట్టేశారు. వాళ్లు నిజాయితీగా ఉంటే ఈ తరహా పరిస్థితులు వచ్చేవి కావన్నారు. వాళ్లు చేస్తే ధర్మం.. మిగతావాళ్లు చేస్తే అధర్మం అన్నట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఏది ఏమైనా స్పీకర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తేల్చేశారు. నియోజకవర్గం ప్రజల కోసం చేశానని, ఇందులో తన స్వార్థం లేదన్నారు. పార్టీ మారడం వల్ల మంత్రి అయ్యేది లేదన్నారు. మా నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో డిప్యూటీ సీఎం అయ్యానని గుర్తు చేశారు. తనకు ఏ పదవి కూడా అవసరం లేదని మనసులోని మాట బయటపెట్టారు కడియం శ్రీహరి.