Kalvakunta Kavitha: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదలు వేసుకున్న గుడిసెలను అధికార యంత్రాంగం తొలగించడాన్ని నిరసిస్తూ బాధితులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ బాధితులతో కలిసి జడ్పీ సెంటర్ వద్ద భారీ ధర్నాకు దిగారు. సుమారు రెండు గంటల పాటు అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది.
ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బాధితులను, నాయకులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మహిళా బాధితులు, లేడీ పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని బాధితులు భీష్మించుక కూర్చున్నారు. ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అంబేద్కర్ సెంటర్ పరిసర ప్రాంతాలు హోరెత్తాయి.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు కల్వకుంట్ల కవితను, విశారదన్ మహరాజ్ను బలవంతంగా అరెస్ట్ చేసి వాహనాల్లోకి ఎక్కించారు. అయితే, కవితను అరెస్ట్ చేసే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడంపై జాగృతి నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మహిళా నాయకురాలిని పురుష పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని వారు నిలదీశారు. పోలీసుల తీరును నిరసిస్తూ కవిత అనుచరులు వాహనాలకు అడ్డుపడటంతో ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది.
వెలుగుమట్ల భూదాన భూముల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదల పొట్ట కొట్టవద్దని, వారికి ప్రత్యామ్నాయం చూపకుండా గుడిసెలు తొలగించడం దుర్మార్గమని కవిత ఈ సందర్భంగా విమర్శించారు. బాధితులకు ఇళ్లు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో భారీగా పోలీసులను మోహరించారు. అరెస్ట్ చేసిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ ఘటనతో జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.