Ameerpet Fire: హైదరాబాద్ అమీర్ పేట అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని శుక్రవారం కవిత పరిశీలించి ప్రమాదం వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ప్రమాదం అనుకోకుండా జరిగింది కాదని తెలుస్తోందని కవిత అన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం వెనకాల ఉన్న మెస్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్న కవిత ప్రస్తావించారు. గతంలో ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందని దానిపై మూడు నెలల క్రితమే స్థానికులు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదన్నారు. అప్పుడే సరైన చర్యలు తీసుకోని ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు.
ఈ ప్రమాదంలో దాదాపు రూ.4 కోట్ల ఆస్తినష్టం జరిగిందని కవిత అంచనా వేశారు. ఆస్తి నష్టంపై సరైన అంచనా వేసి బాధితులందరికీ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన ఒక గంట వరకు కూడా ఫైరింజన్లు రాకపోవడం అత్యంత దారుణమని కవిత మండిపడ్డారు. సరైన సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఉంటే నష్టం చాలా వరకు తగ్గేదన్నారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. కానీ మళ్లీ ఇలాంటి సంఘటనలు జరిగితే పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి సంఘటనలపై సీరియస్ గా దృష్టి పెట్టాలని కవిత సూచించారు.
Also Read: పేదింటి ఆడబిడ్డలకు గుడ్ న్యూస్.. మీ పేరు మీదే సొంత ఇల్లు, మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!
అంతకుముందు మావోయిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి (దేవ్ జీ)ని కూడా కవిత శుక్రవారం పరామర్శించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కవిత స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి దేవ్ జీ ని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాలని కవిత ఆకాంక్షించారు. దేవ్ జీకి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.
Also Read: కమీషన్ల కోసమే ప్రాజెక్టులు.. రూ.వేల కోట్లు దోచేశారు.. బీఆర్ఎస్పై విరుచుకుపడ్డ సీఎం