Kalvakuntla Kavitha: BRS ఎమ్మెల్సీ కవిత వ్యూహం ఏంటి..? రాష్ట్ర రాజకీయాలకే ఆమె పరిమితమవుతారా..? లేదంటే జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారా..? జాగృతి పేరుతో తెలంగాణలో పాలిటిక్స్ చేస్తున్న కవిత.. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలను కలవడం వెనుక ఉద్దేశమేంటి..? అసలు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తును వ్యతిరేకించిన కవిత.. ఇప్పుడు కమలంతో దోస్తీ చేస్తున్న పార్టీలకు సంబంధించిన నేతలతో భేటీ కావడం వెనుక ప్లాన్ ఏంటి..?
ఢిల్లీ పాలిటిక్స్పై ఎమ్మెల్సీ కవిత ఫోకస్ చేశారా..?
ఢిల్లీ పాలిటిక్స్పై ఎమ్మెల్సీ కవిత ఫోకస్ చేశారా..? ఇందుకోసం పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారా..? అంటే అవునన్న వాదన బలంగా విన్పిస్తోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కవిత
కేసీఆర్ కుమార్తెగా అందరికీ సుపరిచితురాలైన కవిత.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జాగృతి పేరుతో ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫున ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. ప్రస్తుతం గులాబీ పార్టీ ఎమ్మెల్సీగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కవిత.
మళ్లీ స్పీడుగా సాగుతున్న జాగృతి కార్యక్రమాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం తదనంతర పరిణామాల్లో మళ్లీ తెలంగాణలో పొలిటికల్గా మరింత యాక్టివేట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. జాగృతిలోకి పలువురిని ఆహ్వానిస్తూ వలస వచ్చిన వారిని చేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారామె. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, కులగణన, బనకచర్ల వంటి అంశాలపై గత కొన్ని రోజులుగా తన వాదనను బలంగా విన్పిస్తున్నారామె.
రాందాస్ అథ్వాలే, జయంత్ చౌదరితో భేటీలు
ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్న రాందాస్ అథవాలే, ఆర్ఎల్డీ చీఫ్గా ఉన్న మరో కేంద్రమంత్రి జయంత్ చౌదరితో ఎమ్మెల్సీ కవిత భేటీ కావడం హాట్ టాపిక్గా మారింది. ఇందుకు ప్రధాన కారణం కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి రాసిన లేఖ, అందులోని అంశాలు లీక్ కావడమే.
బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్కు కవిత లేఖ
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం.. ఆ క్రమంలోనే హస్తిన స్థాయిలో పార్టీకి తగ్గిన బలం, పరపతి, ఇతర అంశాలపై కవిత తన తండ్రికి ఓ లేఖ రాశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్థితులు, లోక్సభ ఎన్నికల తర్వాత మారిన పొలిటికల్ సీన్.. లాంటి అంశాల ఆధారంగా బీఆర్ఎస్లో కొందరు.. బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారామె. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు గులాబీ లీడర్ల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు కవిత. అయితే.. కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ కావడం.. కారు పార్టీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతోందన్న వాదనను అప్పట్లోనే చాలా మంది ప్రముఖంగా ప్రస్తావించారు.
కవిత రాసిన లేఖ లీక్ కావడంతో పార్టీలో ప్రకంపనలు
తన తండ్రికి తాను రాసిన లేఖ లీకైన వ్యవహారంపై ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తన పరిస్థితే ఇలా ఉంటే.. పార్టీలోని సామాన్య కార్యకర్తలు, నేతల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారామె. కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ ఆమె కామెంట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. తన సోదరి కామెంట్లపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీలోని అంశాలపై ఏ స్థాయి నేతలైనా అంతర్గతంగా మాట్లాడాలని సూచించారు. ఈ ఎపిసోడ్ నాటి నుంచీ కవిత విషయంలో బీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించడం లేదన్నది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పే మాట.
జాగృతి తరఫున పాలిటిక్స్ ఉధృతం చేసిన కవిత
సరిగ్గా ఇలాంటి పరిస్థితుల మధ్య బీఆర్ఎస్ తరఫున కాకుండా జాగృతి పేరుతో పాలిటిక్స్ను మరింత ఉధృతం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇప్పటికే పార్టీలోకి వచ్చే పలువురికి కండువాలు కప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ రిజర్వేషన్లు తేల్చిన తర్వాత ప్రభుత్వం ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. బనకచర్ల విషయంలోనూ తమ వైఖరి స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. ఉన్నట్లుండి హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రులతో ఆమె భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కవిత ఏం మాట్లాడారన్నది తెలియకపోయినా.. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, బనకచర్ల అంశంపై చర్చించి ఉంటారన్న టాక్ నడుస్తోంది.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చే వ్యూహమా..?
కేంద్రంలో గతంతో పోలిస్తే మోడీ సర్కారు ఇప్పుడు భాగస్వామ్య పక్షాలపై ఆధారపడే నడుస్తోంది. దీంతో.. రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఒత్తిడి పెంచ వచ్చన్న ఆలోచన ఆమె చేస్తున్నారా అన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం స్పందిస్తే అది కచ్చితంగా తనకు, జాగృతికి మంచి మైలేజ్గా ఉపయోగపడుతుందన్న భావనలో కవిత ఉన్నారన్న అభిప్రాయాన్ని ఆమె సన్నిహత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
జాగృతికి మైలేజ్ తీసుకొచ్చే ప్లానా..?
జరుగుతున్న పరిణామాలను బీఆర్ఎస్ నిశితంగా గమనిస్తోంది. అధినేత కుమార్తె కావడం, పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండడంతో ఎలా స్పందించాలన్న దానిపై ఆ పార్టీ సీనియర్లు మల్లగుల్లాలు పడుతున్నారట. పైగా అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చిన తర్వాతే కవిత పొలిటికల్ యాక్టివిటీస్పై చర్చించడం బెటరని భావిస్తున్నారట గులాబీ లీడర్స్. స్పాట్…