Weather News: తెలంగాణలో రెండు వారాల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం దంచికొడుతోంది. సాయంత్రం కాగానే వర్షం స్టార్ట్ అవుతోంది. వర్షం వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతోంది. రెండు, మూడు రోజుల నుంచి కాస్త వర్షాలు తగ్గాయి. ఈ సీజన్లో ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కొడుతోంది. హైదరాబాద్ లో పది నిమిషాల సేపు వర్షం పడినా మెయిన్ రోడ్లు మొదలుకుని ఇంటర్నల్ రోడ్ల వరకు ఎక్కడ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో జనం నరకం చూస్తున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి భాగ్యనగరంలో పెద్దగా వర్షాలు పడడం లేదు. అయితే ఈ రోజు హైదరాబాద్ నగరంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షం..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వివరించారు. సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, మంచిర్యాల, పెద్దపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో వర్షం
మరో గంట సేపట్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. అక్కడక్కడ పిడుగులు పడుతాయని అధికారులు హెచ్చరించారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
పిడుగులు పడుతున్నాయ్.. జాగ్రత్త..!
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు. పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. భారీ వర్షం పడుతున్న సమయంలో ఇంట్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.