Kavitha: స్వేచ్ఛ, బ్యూరో: మూసీ ప్రక్షాళన అనేది ప్రజలకు మంచి జరిగేలా ఉండాలి.. కానీ మూసీ ప్రాజెక్ట్ కోసం ప్రపంచబ్యాంక్ కు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గతంలోనే చెప్పానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. హైదరాబాద్ లోని జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. హైడ్రా కమిషన్ రంగనాథ్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై డిఫమేషన్ కేసు వేసి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైడ్రా అనే మహమ్మరి వదిలైందనని, అది పేదలను కబళిస్తుందన్నారు. మూసీలో నిర్మించిన ఆదిత్య కన్ స్ట్రక్షన్ కు చెందిన బిల్డింగ్ వద్ద ఇటీవల నిర్వహించిన ధర్నాపై హైడ్రా చేసిన తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు.
రంగనాథ్ సరిగ్గా ఆరు నెలల క్రితమే ఇదే ఆదిత్య కన్ స్ట్రక్షన్ బిల్డింగ్ యాజమాన్యం 0.37 ఎకరాలు ఆక్రమించిందంటూ తహసీల్దార్ కు రాసిన లేఖను ప్రస్తావించారు. ఈ భవన నిర్మాణాన్ని ఆపకపోతే అందులో ఉండేబోయే వారితో పాటు ఆ చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకే ప్రమాదమని లేఖ రాయలేదా? అని ప్రశ్నించారు. వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను తాను సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించారు. తన ధర్నాకు సంబంధించి హైడ్రా పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నిజం మాట్లాడే వాళ్లదే తప్పు అన్నట్టుగా వీడియోలు ఎడిట్ చేసి ఎదురుదాడి చేస్తారా అన్ని ప్రశ్నించారు. హైడ్రా పేదవాళ్ల ఇళ్లను కూల్చుతూ పెద్దవాళ్ల జోలికి వెళ్లటం లేదని మండిపడ్డారు. పేదవాళ్ల పక్షాన తము కచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పారు. పోరాటం చేస్తున్న వారిపైనే తప్పుడు వీడియోలు చేస్తారా అని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం, హైడ్రా ఏమైనా గ్రాఫిక్స్ డిజైనర్లా, కంటెంట్ క్రియేటర్లా? అని ప్రశ్నించారు. పేదలను కొట్టి పెద్దవాళ్లకు భూములు పంచుతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Also Read: HYDRAA: రూ. 250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఇచ్చి న ప్రజెంటేషన్ లో ఎక్కడ కూడా మూసీ ప్రక్షాళన కారణంగా జరిగే మేలు ఏంటో చెప్పలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్ లో ఫేజ్-1 కే దాదాపు 6 వేల 5 వందల కోట్ల నుంచి 7 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఇచ్చారని….కానీ ఆరు నెలల క్రితం మాత్రం 5, 641 కోట్లు అని చెప్పారన్నారు. ఆరు నెలల్లో 14 వందల కోట్లు ఎందుకు పెరిగిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఎస్టీపీల నిర్మాణం, మూసీలో మురుగు నీరు కలిసే 16 నాలాల ప్రస్తావన, పరిహారం గురించి మాట్లాడలేదని, వాటికి అదనంగా ఖర్చు చేయబోతున్నారని విమర్శించారు.
మూసీ రివర్ ఫ్రంట్ లో భాగంగా గత ప్రభుత్వం రివర్ బెడ్ లో 30 లక్షల స్వేర్ ఫీట్ల నిర్మాణం చేపడతామంటే అనుమతి ఇవ్వలేదన్న విషయాన్ని కవిత గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఫేజ్-1 లోనే 18 లక్షల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం చేపడితే ఎలా అనుమతిచ్చారని…దీని వెనుక జరిగిన మాయాజాలం ఏంటనీ ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన లో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారితో కాకుండా రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, ప్రపంచబ్యాంక్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయటమేమిటన్నారు. మూసీ ప్రక్షాళన జరగాలని కానీ అది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. మూసీ పరిరక్షణ అంటే అక్కడ ఆక్రమణలు జరగకుండా, వ్యర్థాలు మూసీ లో కలవకుండా చూడాలని కోరారు.
వెలుగుమట్లలో ప్రభుత్వం 750 ఇళ్లను కూల్చేసి అందులో సగం మందికి కూడా న్యాయం చేయటం లేదనిఆరోపించారు. బాధితుల ఇళ్లు కూల్చిన తర్వాత తాను విశారదన్ మహారాజ్ చేసిన నిరవధిక దీక్షతో ప్రభుత్వం స్పందించిందన్నారు. ఐతే 350 కుటుంబాలకు మాత్రమే పట్టాలు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు వారిలో సగం మందికి కూడా ఇవ్వటం లేదని తమ దృష్టి వచ్చిందన్నారు. అదే విధంగా అక్కడున్న 31 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల భూదాన్ ల్యాండ్ ను ప్రభుత్వం పెద్దవాళ్లకు ఇచ్చే కుట్ర చేస్తుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఈ నెల 17 న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తామని, వెలుగుమట్లలో బాధిత కుటుంబాలు అందరికీ న్యాయం జరిగే వరకు వారికి ధర్మ సమాజ్ పార్టీ, జాగృతి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read: Ganja Seizure: క్యాబేజీ లోడ్లో కోట్లాది రూపాయల గంజాయి.. ఎలా దొరికిపోయారో చూడండి!