Kamareddy News: కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో వీధి కుక్కలపై విష ప్రయోగం జరిగిన ఘటన మరవకముందే, సర్పంచ్ శేఖర్ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. వన్యప్రాణుల సంరక్షణ నిబంధనలకు విరుద్ధంగా రెండు కొండముచ్చులను బంధించిన వ్యవహారంలో ఆయనపై అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
పాల్వంచ మండల కేంద్రానికి చెందిన సర్పంచ్ శేఖర్, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా రెండు కొండముచ్చులను పట్టుకుని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలోని ఒక పంజరంలో బంధించారు. ఈ విషయం జంతు ప్రేమికుడు గౌతమ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
వన్యప్రాణులను అలా నిర్బంధించడం చట్టరీత్యా నేరమని, ఇది జంతు హింస కిందకు వస్తుందని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకుని సర్పంచ్ శేఖర్ను వివరణ కోరారు. వన్యప్రాణులను బంధించడంపై ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
అటవీ శాఖ అధికారుల సమక్షంలో పంజరంలో ఉన్న రెండు కొండముచ్చులను విడిపించి, వాటిని సురక్షితంగా సమీపంలోని అడవిలో వదిలిపెట్టారు. ఇప్పటికే వీధి కుక్కల మరణాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్, ఇప్పుడు వన్యప్రాణుల నిర్బంధం కేసులో కూడా చిక్కుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: మహిళా IAS వ్యవహారంలో బీఆర్ఎస్ కుట్ర.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు