తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రసారమైన వార్తా కథనాలు, ఆ తర్వాతి పరిణామాలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు, బీఆర్ఎస్ నేతల స్పందనపై మల్లన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మహిళా అధికారిపై వచ్చిన డిఫమేటరీ వార్తల వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళా అధికారిని లక్ష్యంగా చేసుకుని, ఆమె వ్యక్తిగత జీవితంపై నిఘా పెట్టించి, తప్పుడు ప్రచారాలు చేయించారని ఆయన మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఒక ఉన్నత స్థాయి అధికారిణి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించడం దుర్మార్గం’ అని ఆయన విమర్శించారు.
జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తూ కేటీఆర్, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను మల్లన్న డ్రామాలుగా కొట్టిపారేశారు. వారికి మీడియాపై ఉన్న ప్రేమతో ఈ స్పందన రాలేదని, తమ పార్టీ రహస్యాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతోనే వారు గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి జర్నలిస్టులను పావులుగా వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
మహిళా ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ను తిరస్కరించింది. తగిన ఆధారాలు లేవని భావిస్తూ జర్నలిస్టులను బెయిల్పై విడుదల చేయడం గమనార్హం. ఇది పోలీసుల అతి ఉత్సాహమా లేక చట్టపరమైన లోపమా అనే చర్చకు దారితీసింది.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మరోసారి సోషల్ మీడియా వేదికగా యుద్ధం మొదలైంది. ఒకవైపు మహిళా అధికారి ఆత్మగౌరవం, మరోవైపు మీడియా స్వేచ్ఛ.. ఈ రెండింటి మధ్య నలుగుతున్న ఈ వివాదం ముందు ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
ALSO READ: Gandhi Bhavan: గాంధీ భవన్లో భారీ పాము కలకలం.. సంక్రాంతి సెలవులతో తప్పిన పెను ప్రమాదం!