Case Against KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు చేసిన ఆరోపణలపై కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడిన కేటీఆర్పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు.. 26వ డివిజన్ కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మే 4వ తేదీన కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. పీఎంజే (PMJ) జ్యువెలరీ దుకాణం దోపిడీ ఘటనను ముఖ్యమంత్రికి అంటగట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గతంలో చంచల్గూడ జైలులో ఉన్నారని, తన అనుచరులను పంపి కరీంనగర్లో దోపిడీ చేయించారంటూ ముఖ్యమంత్రిని బందిపోటు దొంగలతో పోల్చడం అత్యంత దారుణమని మండిపడ్డారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరస్తులతో పోల్చడం.. దోపిడీ చేయించారని ఆరోపణలు చేయడం బీఎన్ఎస్ సెక్షన్లు 356.. 353 ప్రకారం తీవ్రమైన నేరమని అంజన్ కుమార్ స్పష్టం చేశారు. ఇది ప్రజల్లో ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వం.. పోలీసు వ్యవస్థపై అపనమ్మకం కలిగించే కుట్రపూరిత చర్యగా ఆయన అభివర్ణించారు. అధికారం కోల్పోయిన అక్కసుతోనే బీఆర్ఎస్ నాయకులు కనీస విజ్ఞత మరచి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ విమర్శలకు తాము సిద్ధమని.. కానీ వ్యక్తిగత దూషణలు.. అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ముఖ్యమంత్రిపై అబద్ధపు ప్రచారం చేస్తున్న కేటీఆర్పై వెంటనే కేసు నమోదు చేసి విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు పోలీసులను కోరారు. అలాగే చంచల్గూడ జైలులో ఉన్న నేరస్తులతో కేటీఆర్కు గల సంబంధాలపై కూడా కూలంకషంగా విచారణ జరిపించాలని ఫిర్యాదులో విన్నవించారు.
Read Also: భువనగిరిలో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం.. ఆ అంశాలపై ప్రత్యేక చర్చ..!