Karimnagar: అయిన వారినీ.. ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఆ బాధ వర్ణానాతీతం. ముఖ్యంగా మనం అమితంగా ప్రేమించే వారి విషయంలో.. ఈ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అనుభవించే వారికి తప్ప ఆ పెయిన్ ఎవ్వరికీ అర్థం కాదు. ఎన్ని పనుల్లో ఉన్నా వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒంటరిగా ఉన్న టైమ్లో వారితో మాట్లాడుతుంటారు కొందరు. చనిపోయినవారు ఎదురుగా ఉన్నట్లు ఊహించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మానసిక సమస్యలకు లోనవుతారు.
అయితే, చనిపోయిన వాళ్లు తిరిగివస్తారా..? సైన్స్ చావును దీర్ఘకాలం పొడిగించగలదేమో గానీ చనిపోయిన వారిని తిరిగి బతికించే అవకాశం లేదు. అయితే, వారితో మాట్లాడించగలదు. ఇలాంటి వారి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో సంచలనాత్మక టెక్నాలజీ వచ్చింది. AI టెక్నాలజీ ఉపయోగించి.. చనిపోయిన వారి వీడియోలు రూపొందించడం.. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్గా మారుతోంది.
చిన్న వయస్సులోనే అమ్మానాన్నలను కోల్పోయిన మనస్వికకు, జీవితంలోని ఒక అత్యంత భావోద్వేగభరితమైన క్షణం.. కరీంనగర్లో జరిగిన ఓణి ఫంక్షన్లో ఎదురైంది. చిన్నారి మనస్వికపై ప్రేమతో కుటుంబ సభ్యులు అందరు కలిసి AI సాయంతో అనుకోని సర్ప్రైజ్ను ప్లాన్ చేసి.. అందరినీ కంటతడి పెట్టించేలా చేశారు. చనిపోయిన తల్లిదండ్రులను AI ద్వారా ఫంక్షన్లో స్క్రీన్పై వీడియో చూసి.. మనస్విక కన్నీరుమున్నీరైంది.
వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ మారుతినగర్కు చెందిన నిమ్మల చందు – సుమలత దంపతులు అనారోగ్యం కారణంగా.. 6 సంవత్సరాల కింద కన్నుమూశారు. అప్పటికే వారు ఒక కుమారుడు, కుమార్తెకు జన్మానిచ్చారు. వారి అమ్మ నాన్నలు మృతిచెందిన సమయంలో ఇద్దరు పిల్లలు చాలా చిన్నవారు. వారి అమ్మానాన్న ఎలా ఉంటారో కూడా తెలియని వయసులో.. ఆ చిన్నారులు వారి ప్రేమకు దూరం అయ్యారు. అయితే మంగళవారం ఆ చిన్నారి మనస్విక ఓణి ఫంక్షన్ను కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హల్లో చాలా గ్రాండ్గా చేసారు.
చిన్నతనం లోనే అమ్మానాన్నల ప్రేమకు దూరమైనా ఆ చిన్నారికి.. వారి కుటుంభ సభ్యులు సర్పైజ్ ప్లాన్ చేసారు. మనస్విక నానమ్మ, తాతయ్య, బాబాయ్లు AI ద్వారా స్వర్గం నుండి.. తల్లితండ్రులు ఆ ఫంక్షన్కు వచ్చినట్లు, చిన్నారిని హత్తుకున్నట్లు, వారితో ఫోటో దిగినట్లు.. స్క్రీన్ పై ప్లే చేయడంతో చిన్నారి కన్నీరుమున్నిరైంది. చిన్నారే కాకుండా ఆ ఫంక్షన్కు హాజరైనా వారందరు కూడా.. ఆ వీడియో చూసి కంటతడి పెట్టారు. ఆ వీడియో చూస్తూ మనస్విక ఓ వైపు దుఃఖం తో మరోవైపు సంతోషంగా కనిపించింది. పిల్లల కోసం అలా ప్లాన్ చేసిన వారి నానమ్మ, తాతయ్య, బాబాయ్ లను పలువురు ప్రశంశించారు.
Also Read: స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇండియాలో.. నెలకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?
కాగా.. ఇటీవలి కాలంలో, అనేక చైనీస్ కంపెనీలు “డెడ్ బాట్లను” రూపొందిస్తోంది. మరణించిన వ్యక్తులను అనుకరిస్తూ AI అవతార్లను సృష్టిస్తోంది. ఈ డిజిటల్ కాపీలు మరణించిన వారి నుండి.. ఆడియోవిజువల్ మెటీరియల్ వాల్యూమ్లను సాఫ్ట్వేర్లోకి అప్లోడ్ చేయడం ద్వారా రూపొందిస్తారు. తద్వారా కుటుంబ సభ్యులు.. వారి మరణించిన బంధువుల అవతార్లతో మాట్లాడొచ్చు. దీని కోసం, వాయిస్ రికార్డింగ్లు, ఇమేజ్లు, వీడియోలను విశ్లేషించి మరణించిన వ్యక్తిని పోలి ఉండే.. డిజిటల్ వ్యక్తిత్వాన్ని తయారుచేస్తారు. అమెరికాకు చెందిన స్టోరీ ఫైల్ అనే సంస్థ కూడా ఇలాంటి ఏఐ టెక్నాలజీని రూపొందించింది. అయితే, ఈ టెక్నాలజీ కొంత వివాదానికి కూడా కారణం కాకపోలేదు. దుఃఖాన్ని అధిగమించే విషయంలో మనుషుల సహకారం కన్నా పెద్ద ప్రత్యామ్నాయం లేదని కొందరు భావిస్తున్నారు. మనుషులతో సన్నిహితంగా ఉండడం, వారి పట్ల శ్రద్ధ చూపించడం, మనం చేసే పనులను ప్రశంసించడం.. ఇలాంటి విషయాల్లో సాంకేతికత జోక్యం అమానవీయమని విమర్శిస్తున్నారు.