KCR : ఎట్లుండే కేసీఆర్.. ఎట్లైండు కేసీఆర్. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైన గులాబీ బాస్ను చూసి అంతా అనుకుంటున్న మాట ఇది. కేసీఆర్కు ఏమైంది? అంత వీక్గా ఎందుకు ఉన్నారు? ముఖంలో కళ తప్పిందెందుకు? కనీసం నాలుగు అడుగులు కూడా ఎందుకు వేయలేకపోతున్నారు? గన్మెన్ను పట్టుకుని నడుస్తున్నారంటే ఏమనుకోవాలి? సడెన్గా ఇలా ఎందుకు అయ్యారు? అంటూ చర్చించుకుంటున్నారు పార్టీ శ్రేణులు.
కేసీఆర్ వయస్సు 71 ఏళ్లు. మరీ అంత బలహీనంగా ఉండేంత ఏజ్ ఏమీ కాదు. కేసీఆర్ బక్కపలుచ మనిషి కాబట్టి.. ఫిట్ గానే ఉంటారు. అందులోనూ ఏడాది కాలంగా బయటకు రాకుండా ఫాంహౌజ్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అలా కూర్చొని తింటూ ఉంటూ ఎవరైనా మరింత పుష్టిగా, బలంగా తయారవుతారు. కానీ, అందుకు భిన్నంగా కేసీఆర్ చాలా చాలా వీక్ అయ్యారని అంటున్నారు. ఎందుకు? అది శారీరక బలహీనతా? మానసిక వేధనతో అలా అయ్యారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. తనకు ఆరోగ్యం బాలేదంటూ.. కాళేశ్వరం కమిషన్తో వన్ టు వన్ విచారణ సైతం కోరారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోందని అంటున్నారు.
కేసీఆర్ వీక్.. అందుకేనా?
కేసీఆర్ పుట్టెడు కష్టాల్లో ఉన్నారని అంటున్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడం ఆయన వల్ల కావట్లేదు. అందుకే అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఏదో తన మానాన తాను ఫాంహౌజ్లో మసలా దోస తింటుంటే.. కొత్తగా కూతురు కల్లోలం ఆయన్ను తీవ్రంగా కలిసి వేసినట్టు చెబుతున్నారు. పార్టీ మీద ఫోకస్ పెట్టాలా? కూతురు గొడవ తీర్చాలా? కొడుకును దూరం చేసుకోవాలా? అర్థం కాక తెగ సతమతమవుతున్నారట. కవిత వేసిన బాంబులు మామూలుగా లేవు మరి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ.. తానసలే మంచిదాన్ని కాదంటూ వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. ఇదే పని మరొకరు చేసుంటే ఈపాటికి వాళ్ల సంగతి తేల్చిపడేసే వారే గులాబీ బాస్. కానీ, ఇంత రచ్చ చేస్తున్నది కూతురే కావడంతో.. అందులోనూ కొడుకు మీదే ఆరోపణలు చేస్తుండటంతో కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. కూతురును కట్టడి చేయలేక.. ఆమె చేస్తున్న డ్యామేజ్ను కంట్రోల్ చేయలేక.. తీవ్ర మనోవేధనకు గురవుతున్నారని చెబుతున్నారు. అందుకే మానసికంగా కృంగిపోయి.. ఇలా శారీరకంగా వీక్ అయ్యారని అంటున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు ఫాంహౌజ్కు వచ్చిన కవిత ముఖం కూడా చూడటానికి కేసీఆర్ ఇష్టపడలేదంటే.. కూతురు మీద ఆయన ఎంత కోపంతో ఉన్నారో తెలిసిపోతోందని అంటున్నారు.
కేసీఆర్ భయపడుతున్నారా?
ఫ్యామిలీ ఎపిసోడే కాదు.. కేసులతోనూ కేసీఆర్ చాలా కంగారు పడుతున్నారని తెలుస్తోంది. గడిచిన రెండు వారాలుగా గులాబీ బాస్ చేసిన ఒకే ఒక పని.. హరీష్రావుతో వరుసగా చర్చించడం. గంటలకు గంటలు మాట్లాడటం. అంతా కాళేశ్వరం ప్రాజెక్టు గురించే. కమిషన్కు చెప్పాల్సిన సమాధానాల గురించే. హరీష్రావుతో పాటు లీగల్ టీమ్స్తో, రిటైర్డ్ ఇంజినీర్లతో, ఇప్పటికే విచారణకు హాజరైన అధికారులతో.. రోజుల తరబడి సుదీర్ఘంగా భేటీలు జరిపారు. ఆ కేసు నుంచి తాను ఇక తప్పించుకోలేనేమో అనే టెన్షన్ తోనే ఆయనంతలా కంగారు పడ్డారని అంటున్నారు. లేదంటే, ఒక ఎంక్వైరీ కోసం ఏకంగా రోజుల తరబడి చర్చలు జరపడం కేసీఆర్ గత చరిత్రలో ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. కాళేశ్వరం కేసులో తన అరెస్ట్ తప్పదా? అనే ఆందోళన కూడా ఆయన అనారోగ్యానికి ఒక కారణం అయి ఉంటుందనే చర్చ జరుగుతోంది.
Also Read : కవిత ముఖం చూడని కేసీఆర్.. ఇదిగో సాక్ష్యం!
కేసీఆర్ శకం ముగిసినట్టేనా?
అటు, కొడుకు కేటీఆర్ మీద సైతం ఫార్ములా ఈ కారు రేసు కేసు నడుస్తోంది. అది కూడా తేలిగ్గా తీసిపడేసే కేసు కాదు. మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు సైతం ఇండియా వచ్చేశారు. సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన అసలు నిజాలు చెప్పేస్తే.. తన వెనుక ఉన్న పెద్దలెవరో పేర్లు వెల్లడిస్తే..? అందరికంటే ఆనాటి సీఎం కేసీఆర్కే ఎక్కువ తిప్పలు అని అంటున్నారు. ఇలా వరుస పరిణామాలతోనే కేసీఆర్ మానసికంగా, శారీరకంగా కృంగిపోయి.. అంత బలహీనంగా కనిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి, ఈ వయస్సులో ఇంత కష్టం వచ్చిన కేసీఆర్.. ఇప్పట్లో కోలుకునేనా? మళ్లీ పాత కేసీఆర్ చూడతరమా? ఆ వాడివేడి మాటలు.. చురుకుదనం.. సాధ్యమేనా? లేదంటే, కేసీఆర్ శకం ముగిసినట్టేనా?