Ponnam Prabhakar: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన నూతన సర్పంచ్లకు.. డీసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో మరింత బలపడేందుకు ఈ సర్పంచ్ల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమురి వెంకట్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. పార్టీ నేతలంతా నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లు గ్రామ ప్రజలకు ప్రతినిధులుగా పనిచేయాల్సిన బాధ్యత ఎంతో ఉందన్నారు. “గ్రామానికి సంబంధించిన ప్రతి సమస్యలో ప్రజలు ముందుగా సర్పంచ్లనే ఆశ్రయిస్తారు. ప్రభుత్వ పథకాలు గ్రామాలకు సక్రమంగా చేరేలా చూడాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలవాలి” అని సూచించారు. ప్రభుత్వం, పార్టీ రెండూ సర్పంచ్లకు పూర్తి సహకారం అందిస్తాయని భరోసా ఇచ్చారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సహకార సంఘాల ఎన్నికలతో పాటు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సర్పంచ్ల పాత్ర కీలకమని మంత్రి తెలిపారు. ఎన్నికలు జరగక ఆగిపోయిన నిధులు త్వరలోనే విడుదల అవుతాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే నిధులు కూడా గ్రామాభివృద్ధికి ఉపయోగపడతాయని వివరించారు.
వేసవికాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందుగానే సమీక్షలు నిర్వహించి పరిష్కారం కనుగొనాలని సర్పంచ్లకు సూచించారు. గ్రామాల్లో శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, ప్లాంటేషన్, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు సక్రమంగా హాజరవుతున్నారా లేదా పరిశీలించాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాల బస్సులు గ్రామాల్లోకి రాకుండా చూసి, ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలోనే చదివేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. మంచి అనుభవం ఉన్న ఉపాధ్యాయులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అయితే దానికి సమాధానం చెప్పకుండా పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, పేరు తీసేసి కొత్త పేర్లు పెట్టడం ద్వారా గాంధీ భావజాలాన్ని చెరిపివేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
నెహ్రూ, ఇందిరా గాంధీల పేర్లు, వారు అమలు చేసిన పథకాలు, నిర్మించిన ప్రాజెక్టులు దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాయని గుర్తు చేశారు. గరిబీ హటావో వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపాయని తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను ఆరాధించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో రేపు ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద, గాంధీ చౌరస్తాల్లో గాంధీ ఫోటోలను ఉంచి ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా పనిచేయాలని కోరారు. గెలిచిన వారితో పాటు ఓడిపోయిన వారితో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గెలిచిన సర్పంచ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాంగ్రెస్ కుటుంబం ఎప్పుడూ మీ వెంట ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.