Nalgonda Suicide: ప్రేమించిన వారే లోకంగా బతికారు.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరూ క్షణికావేశానికి లోనయ్యారు. నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాద సంఘటన రెండు కుటుంబాల్లో తీరని కన్నీళ్లు మిగిల్చింది. ప్రియురాలు తనువు చాలించిందన్న వార్త విన్న కొన్ని గంటల్లోనే.. ప్రియుడు కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
క్షణికావేశంలో బలవన్మరణం
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఈ గుండెల్ని పిండేసే ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న, చరణ్ అనే ఇద్దరు యువతీయువకులు కొంతకాలంగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని, కలిసి నడవాలని ఎన్నో కలలు కన్నారు. అయితే, ఏమైందో ఏమో కానీ.. లక్ష్మీ ప్రసన్న ఆదివారం తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఊహించని ఈ పరిణామంతో ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
అనుమానాలు.. ఆరోపణలు
లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్యకు చరణ్ ప్రవర్తనే కారణమంటూ యువతి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి మధ్య ఇటీవల జరిగిన కొన్ని గొడవలే ఆమెను ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయని వారు అనుమానించారు. ఈ క్రమంలో చరణ్పై ఒత్తిడి పెరగడం, ప్రియురాలి మరణవార్తను తట్టుకోలేకపోవడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ప్రియురాలి వెంటే ప్రియుడు..
తన వల్లనే లక్ష్మీ ప్రసన్న చనిపోయిందనే బాధో, లేక ఆమె లేని జీవితం వేస్ట్ అనుకున్నాడో కానీ.. చరణ్ కూడా ఘోర నిర్ణయం తీసుకున్నాడు. ప్రియురాలి మరణవార్త తెలిసిన కొద్ది గంటల్లోనే గ్రామానికి సమీపంలో ఉన్న ఒక తాటి చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు ప్రేమికులు ప్రాణాలు కోల్పోవడంతో మునుకుంట్ల గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ జంట ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న కట్టంగూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అసలు వారి మధ్య ఏం జరిగింది? లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? చరణ్ను ఎవరైనా బెదిరించారా? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేతపై మహిళ ఇంకు దాడి.. అసలేం జరిగిందంటే?