తెలంగాణ రాజకీయం ఉన్నట్టుండి ఏపీకి పాకింది. అక్కడి రాజకీయాలను ముడిపెడుతూ రాష్ట్ర పార్టీల నేతలు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. అది కాస్త పొలిటికల్ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా మారింది. అసలు తెలంగాణ రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు సంబంధం ఏంటని అందరికీ అనుమానం కలగొచ్చు. ఎవరి రాష్ట్రం వారిదే. ఎవరి ప్రభుత్వం, పాలన వారికే ఉన్నది. విభజన హామీల గురించి పెద్దగా ప్రస్తావన కూడా లేదు ఇప్పుడు. మరిఎందుకు తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ప్రస్తావన వస్తుందంటే అందుకు మన రాజకీయ నేతలే సమాధానం చెప్పాలి. ఇదంతా కేసీఆర్ వల్లే అధికార పార్టీ నేతలు అంటున్నారు. లేదు రేవంత్ రెడ్డి వల్లే అని అటు బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో పంచ్ డైలాగుల హవా నడుస్తున్నది. సవాళ్లు, విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత? ప్రజా సమస్యలను గాలికి విడిచి రెచ్చగొట్టే ధోరణితో ముందుకు వెళుతున్నారు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. నేతల విమర్శలతో అసలు సమస్యలు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రతిపక్షాలు దానిపై ప్రశ్నించాలి. అందుకోసం ప్రజల తరఫున కొట్లాడాలి. అంతేకానీ ఒకరినొకరు పర్సనల్ ఎజెండాతో తిట్టుకుంటే ఎవరికి లాభం? ఇది నేటి రాజకీయనాయకులకు ఇంకెప్పుడు అర్థం అవుతుంది.
ఈ మధ్య కేసీఆర్ పరుష పదజాలంతో అధికార పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విమర్శలు నార్మల్గా కూడా చేయొచ్చు.కానీ, ఆయన కాస్త అగ్రెసివ్గా సీఎం రేవంత్, మంత్రులను కలిపి ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరి తోలు తీస్తానంటూ రెచ్చిపోయారు. దీనికి బదులుగా మంత్రులు సైతం లిమిట్ క్రాస్ చేసి కేసీఆర్, కేసీఆర్ ఇద్దరినీ కలిపి ఘాటు విమర్శలు చేశారు. మంత్రుల తర్వాత సీఎం రేవంత్ సైతం రంగంలోకి దిగారు. ఆయన కాస్త ఎక్కువే మాట్లాడారు. దీని గురించి ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. కేసీఆర్ పాస్ పోర్టు బ్రోకర్ అని, కేటీఆర్ లాగులో తొండలు విడిచి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. సొంత చెల్లిని ఇంట్లోనుంచి గెంటేసిన వాడివి నువ్వేం మనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని అన్ని పార్టీల నుంచి పలువురు నేతలు స్పందించారు.
ఇదిలాఉంటే కేటీఆర్ గుంటూరు, ఫారిన్లో చదువుకున్నాడని అందుకే ఆయనకు భాషపై పట్టు ఉందని, తాను జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నానని గుర్తుచేశారు. అందుకే తనకు భాష మీద పట్టు లేదని పేర్కొన్నారు. భాష రాకపోయినా పర్లేదు అని జపాన్ వాళ్లకు భాష రాకపోయినా ప్రపంచంలోనే వారికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం రేవంత్ పలుమార్లు గుర్తుచేసిన సందర్భాలు ఉన్నాయి. దీనిపై తాజాగా కేటీఆర్ సైతం స్పందించారు. మాట్లాడితే తాను గుంటూరులో చదువుకున్నానని రేవంత్ మాట్లాడుతున్నారు.. ఆయన చదువుకోవద్దని తాను ఏమైనా చెప్పనా? మరి ఆయన అల్లుడు ఆంధ్రా వ్యక్తే కదా? మొత్తం ఆయనకే కట్టబెడుతున్నాడు కదా? దీనిని బట్టి రేవంత్ను భీమవరం బుల్లోడు అని పిలువచ్చా? అని ప్రశ్నించారు. దీనికి తోడు కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేయడం.. కేటీఆర్ గుంటూరు చదువు.. రేవంత్ అల్లుడు ఆంధ్రా వక్తి కావడం.. ఇలా తెలంగాణ రాజకీయాలు కాస్త ఆంధ్రాకు పాకుతుండటంపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఇక్కడి సమస్యలు గాలికొదిలేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఏంటని పలువురు చర్చించుకుంటారు.