Telangana Global Summit: తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కి ప్రపంచ దేశాల నుంచి, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, ప్రతినిధులు భారీ స్థాయిలో హాజరవుతున్నారు. ఈ ప్రముఖ అతిథులను స్వాగతించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోంది. అందులో భాగంగా అతిథులకు అందించాల్సిన గిఫ్ట్లను స్థానిక కళలను ప్రతిబింబించేలా సిద్ధం చేస్తోంది. ఇదే భాగంగా ఈసారి సమ్మిట్కు వచ్చే ప్రతిష్ఠాత్మక అతిథులకు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతులను బహుమతులుగా ఇవ్వాలని నిర్ణయించడం విశేషం.
కరీంనగర్ ఫిలిగ్రీ కళ చరిత్ర చాలా పురాతనమైనది. కాకతీయుల కాలం నుంచే ఫిలిగ్రీ కళకి గుర్తింపు ఉంది. వెండిని పలుచటి తీగల్లా మార్చి అద్భుతమైన ఆకృతులు చేయడం ఈ కళాకారుల ప్రత్యేక నైపుణ్యం. కాలక్రమేణా నిజాం కాలంలో కూడా కరీంనగర్ ఫిలిగ్రీకి డిమాండ్ పెరిగింది. నిజాం నవాబులు, రాజవంశాలు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చి ఫిలిగ్రీ నెమళ్లు, దేవీ విగ్రహాలు, హస్తకళలు తయారుచేసేవారు. ఈ కళకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో పాటు ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI)’ ట్యాగ్ కూడా దక్కింది.
ఇటీవలి సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఫిలిగ్రీ కళను.. ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించింది. జీ–20 సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు కరీంనగర్ ఫిలిగ్రీ జ్ఞాపికలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా.. ఇది వరల్డ్ ప్లాట్ఫారమ్పై వెలిగింది. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రధాని మోదీకి ఇచ్చిన 5 కిలోల భారీ ఫిలిగ్రీ నెమలి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తొలిసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు అందించిన 2.5 కిలోల కాకతీయ కళాతోరణం, గత పారిశ్రామిక వేత్తల సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన ఇవాంక ట్రంప్కు అందించిన ఫిలిగ్రీ నెమలి జ్ఞాపిక.. ఇవన్నీ కరీంనగర్ కళాకారుల ప్రతిభను అంతర్జాతీయ వేదికలపై నిలిపాయి.
ఈ యేడాది తెలంగాణ రైజింగ్లో భాగంగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కోసం.. ప్రభుత్వం ప్రత్యేక ఆర్డర్ను కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సొసైటీకి ఇచ్చింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చే అతిథులకు అందించేందుకు ‘గౌతమ బుద్ధుని ప్రత్యేక ఫిలిగ్రీ ప్రతిమలను రూపొందించడానికి కళాకారులు గత వారం రోజులుగా నిరంతరం పని చేశారు.
ప్రతి జ్ఞాపికకు సుమారుగా రూ.35,000 విలువ ఉంటుందని సమాచారం. మొత్తం 100 కంటే ఎక్కువ ఫిలిగ్రీ జ్ఞాపికలు సిద్ధం చేయడం ఒక పెద్ద సవాలే అయినా, అనుభవజ్ఞులైన కళాకారులు ఎంతో నైపుణ్యంతో ఈ పనిని సమయానికి పూర్తి చేశారు.
Also Read: ఎన్నికల రోజున పరీక్షలా? కవిత ఆగ్రహం
ప్రతి ఫిలిగ్రీ ప్రతిమ లోపల నుంచి వెలిగే ఆకర్షణను కల్పించేందుకు ప్రత్యేక రూపొందింపు చేశారు. బుద్ధుని శాంతి స్వరూపం, కరుణ భావం, అందమైన వంకర తీగలతో చేసిన డిజైన్ అన్ని వర్గాల అతిథులను ఆకట్టుకునేలా ఉంది. శిల్పం తయారీ ప్రక్రియలో 100 శాతం చేతిపని ఉండటం, అందుకే ఇవి మరింత విలువైనవిగా నిలుస్తున్నాయి. కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకత కలిసిన ఈ ప్రత్యేక జ్ఞాపికలు తెలంగాణ సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పనున్నాయి.