Kavitha Tweet: కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర ట్వీట్ చేశారు. తన తండ్రి కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా ఒక యోధుని దీక్ష అమరుల త్యాగం యావత్ తెలంగాణ జాతిని మేల్కొల్పింది. ఐక్యతా గీతమైంది. స్ఫూర్తిని నింపింది. ఉద్యమాన్ని విజయపథం వైపు నడిపింది. రాష్ట్ర సాధానకు దారి దీపమైంది. భౌగోళిక తెలంగాణ సాథించాం. సామాజిక తెలంగాణ సాధిస్తోంది. జై తెలంగాణ అని పేర్కొన్నారు.
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభించడం ద్వారా తెలంగాణ ఉద్యమం దేశవ్యాప్తంగా మరో మలుపు తిరిగింది. ఈ దీక్షతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారాయి.
ఈ ప్రత్యేక రోజున కవిత చేసిన ట్వీట్ భావోద్వేగంగా ఉండటమే కాకుండా, రాజకీయ సంకేతాలు కూడా ఇస్తున్నట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. తండ్రి పేరును నేరుగా ప్రస్తావించకుండా “యోధుడు” అని పేర్కొనడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందా అన్న చర్చ మొదలైంది.
మరోవైపు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకున్నారు హరీష్ రావు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో 2009 నవంబర్ 29న ప్రారంభమైన ఆమరణ దీక్ష ఉద్యమ గతిని పూర్తిగా మలుపు తిప్పిందని పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రత్యేక తెలంగాణ సాధ్యమా అన్న సందేహాలు ఉన్న వేళ, ఆ దీక్ష దేశ రాజకీయాలను కుదిపివేసిందని తెలిపారు. అదే దీక్షతో ఒక సరికొత్త చరిత్రకు నాంది పలికిందని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిందని స్పష్టం చేశారు.
Also Read: మంత్రులకు షాక్.. తెలంగాణ కేబినెట్లో కీలక మార్పులు
‘రానే రాదు, కానే కాదు’ అంటూ కొందరు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అసాధ్యంగా చిత్రీకరించిన సమయంలో, సబ్బండ వర్గాలను ఏకం చేసి ప్రత్యేక తెలంగాణను సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ ది అని హరీష్ రావు కొనియాడారు. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సాకారం చేయడానికి అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు.
పదవుల కోసం కాకుండా, తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ ధీరత్వం ఆయనదేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకంగా కేసీఆర్ నిలిచారని, నాలుగు కోట్ల ప్రజలలో ప్రతిధ్వనించే “జై తెలంగాణ” అనే రణ నినాదానికి ఆయనే ప్రతిరూపమని హరీష్ రావు తన పోస్ట్లో పేర్కొన్నారు.