Kalvakuntla Kavitha: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు నిర్వాకం వల్లే దక్షిణ తెలంగాణ రైతులు.. నేటికీ సాగునీటి కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆమె మండిపడ్డారు. హరీష్ రావు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేసి భవిష్యత్తును నాశనం చేశారని ఆరోపించారు.
ఎల్లూరు పంప్ హౌస్ను హరీష్ రావు కాంట్రాక్టర్లతో కలిసి.. అండర్గ్రౌండ్ పంప్ హౌస్గా మార్చారని ఆమె ఫైర్ అయ్యారు. ఈ మార్పు వల్ల బ్లాస్టింగ్ చేయాల్సి వచ్చిందని, దాని కారణంగా 3వ, 5వ మోటర్లు పూర్తిగా పనిచేయకుండా పోయాయని తెలిపారు. హరీష్ రావు నిర్వాకం కారణంగా నేటికీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కేవలం మూడు మోటర్లే పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఉరుకులు, పరుగులతో పూర్తి చేసినట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా.. అదే వేగంతో చేపట్టి ఉంటే నేడు దక్షిణ తెలంగాణ పరిస్థితి వేరేలా ఉండేదని కవిత వ్యాఖ్యానించారు. కానీ పాలమూరు ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు పాలమూరుకు మాత్రం తీరని అన్యాయం చేశారని విమర్శించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణా నది దాదాపు 300 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తున్నా కృష్ణా జలాల విషయంలో.. మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని కవిత అన్నారు. రాష్ట్రానికి 550 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉండగా, కనీసం 299 టీఎంసీల నీళ్లను కూడా వినియోగించుకోలేకపోయామని ఆమె పేర్కొన్నారు.
25 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్న జిల్లాలో కాళేశ్వరం ద్వారా కేవలం 6.5 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించడం గొప్పతనమా? అని బీఆర్ఎస్ నేతలను కవిత ప్రశ్నించారు. ఇది అభివృద్ధి కాదు, ఇది పాలమూరు రైతులపై చేసిన ఘోరమైన ద్రోహమని ఆమె విమర్శించారు. దక్షిణ తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడమే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 12.3 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో.. 2015లో రూ.35,200 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారని కవిత గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్రమాల కారణంగా ఆ ప్రాజెక్టు వ్యయం రూ.58 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. 2023లో మొదటి దశ ప్రారంభమైనప్పటికీ, ఇప్పటికీ పూర్తి స్థాయిలో పనులు జరగడం లేదని ఆమె ఆరోపించారు.
Also Read: ప్రభుత్వ పథకాలు సక్రమంగా చేరేలా.. సర్పంచ్లు ప్రజలకు అండగా నిలవాలి: పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి.. పూర్తి చేస్తామని హామీ ఇచ్చిందని పేర్కొన్న కవిత, ఆ హామీని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులు కాగితాల మీద కాదు, పొలాల్లో నీళ్లు వస్తేనే అభివృద్ధి అని ఆమె స్పష్టం చేశారు. పాలమూరు రైతులకు న్యాయం జరిగే వరకు తాము ప్రశ్నిస్తూనే ఉంటామని కవిత స్పష్టంగా చెప్పారు.