Kavitha vs Krishnarao: తెలంగాణలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి మార్గాలు కనుగొనే లక్ష్యంతో.. తెలంగాణ జాగృతి చేపట్టిన ‘జాగృతి జనంబాట’ కార్యక్రమం ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో దూకుడు పెంచింది. ఈ కార్యక్రమాన్ని కల్వకుంట్ల కవిత ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఐదు రోజులపాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తూ, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ప్రజా సమస్యలు, ఇళ్లపట్టాలు అన్నింటినీ పరిశీలించేందుకు కవిత బృందంతో కలిసి ఫీల్డ్ లెవెల్ లోకి దిగారు.
జాగృతి అధ్యక్షురాలు కవిత బోయిన్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. స్కూల్ అభివృద్ధి కోసం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో కొన్ని పనులు పూర్తయ్యాయని, అయినప్పటికీ ముఖ్యమైన అవసరాలైన కాంపౌండ్ వాల్, సీసీ కెమెరాలు లేవని గుర్తించారు. ఈ లోపాలను జాగృతి తరఫున తాము భర్తీ చేస్తామని కవిత హామీ ఇచ్చారు.
అంగన్వాడీ సెంటర్ను స్కూల్లో విలీనం చేసినప్పటికీ, అక్కడ హెల్పర్ల కొరత ఉన్నట్లు స్థానికులు వివరించడం నేపథ్యంలో, ఆ సమస్యను కూడా తమ స్థాయిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమం సందర్భంగా మాట్లాడిన కవిత, కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు తనపై చేసిన విమర్శలపై స్పందిస్తూ, ఆయన నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్ను బయటపెడుతోంది అని పేర్కొన్నారు. తనపై చేసిన ప్రతి ఆరోపణకు డాక్యుమెంట్లతో సహా త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సమగ్ర సమాధానం ఇస్తానని తెలిపారు.
తన వ్యాఖ్యలు రాజకీయ దాడి కాదని, కేవలం కూకట్ పల్లి ప్రజలు పదేళ్లుగా.. ఎదుర్కొంటున్న సమస్యలనే గుర్తు చేసానని స్పష్టం చేశారు. ప్రజలు వినిపిస్తున్న ప్రతిదాన్ని గమనిస్తున్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో తెలుసుకుంటున్నారు అని ఆమె అన్నారు.
అదే విధంగా, ఇళ్ల పట్టాల సమస్యలు ఉన్నవారిని కూడా కలిసిన కవిత, జాగృతి ఒక సంస్థగా తమ వంతు సహాయం అందిస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పాలక పక్షం కూడా, ప్రతిపక్షం కూడా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం లేదని, అందుకే జాగృతి ప్రజల గళంగా ముందుకు వచ్చిందని కవిత పేర్కొన్నారు. మంచిని మంచిగా చెడును చెడుగా చెబుతాం.. నిజం మాటే మాట్లాడుతాం అని ఆమె పేర్కొంది.
Also Read: మెగాస్టార్ చిరంజీవిని కలవడం నిజంగా సర్ ప్రైజ్: ఆనంద్ మహీంద్రా
మాజీ ఎంపీగా పనిచేసిన సమయంలో తాను నిజామాబాద్కే పరిమితం అయ్యానని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి ప్రజల అసలు సమస్యలు ఏమిటో తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు.