Kavitha vs Malla Reddy: మేడ్చల్ అభివృద్ధి గురించి మాజీ మంత్రి మల్లా రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై.. ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో స్పందించారు. పూలు అమ్మిండు, పాలమ్మిండు.. కాని వేల ఎకరాలు కబ్జా పెట్టిండు అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మేడ్చల్ను అభివృద్ధి చేసిన నాయకుడిగా మల్లా రెడ్డి స్వయంగా చెప్పుకున్నప్పటికీ, నేలమీద పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని కవిత విమర్శించారు.
మేడ్చల్, జవహర్నగర్, దమ్మాయిగూడ ప్రాంతాల్లో తన పర్యటన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా బయటపెట్టారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి.. మూడు పదవులు వహించిన నాయకుడు అభివృద్ధిని గొప్పగా చెప్పుకోవడం ఆశ్చర్యమే. ఎక్కడ చూసినా ప్రజలు మౌలిక సదుపాయాల కోసం పోరాటం చేస్తున్నారు అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు తాగునీరు, రోడ్లు, కరెంట్, విద్య, వైద్య సేవలు.. అన్నీ అతి పెద్ద సమస్యలుగానే నిలిచిపోయాయని ఆమె తెలిపారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పుకునే మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అవసరాన్ని తీరేలా లేవని, ఫలితంగా ఇది పూర్తిగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయిందని అన్నారు. ప్రజల డబ్బుతో నడుస్తున్న ప్రైవేట్ వ్యవస్థలే ఇక్కడ అధికారంగా మారాయి. ప్రభుత్వం మాత్రం కనిపించడంలేదు అని ఆమె విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో జవహర్నగర్ డంప్ యార్డ్ సమస్య కొంతమేర తగ్గిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి మరింత దారుణంగా మారిందని కవిత పేర్కొన్నారు. పెద్ద ఎత్తున లారీలు వస్తుండడం వల్ల ప్రమాదాలు పెరిగాయని, వీటిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ పైప్లైన్లు ఉన్నప్పటికీ వారంలో ఒకసారి కూడా నీళ్లు రాకపోవడం.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని చెప్పారు. రిజిస్ట్రేషన్ సమస్యల కారణంగా నీటి సరఫరా నిలిపివేశామని.. మున్సిపల్ అధికారులు చెబుతున్న దానిపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ లేదు అంటే నీటిని ఆపేస్తారా? ఇది ఏ రకమైన పాలన? అని ఆమె ప్రశ్నించారు.
జవహర్నగర్ పరిధిలో 58, 59 జీవో కింద ప్రజలు భారీగా డబ్బులు చెల్లించినప్పటికీ, రిజిస్ట్రేషన్ ఇప్పటికీ జరగలేదని కవిత తెలిపారు. అయితే అదే ప్రాంతంలో మల్లా రెడ్డి, కొంతమంది నేతల భూములు సులభంగా రిజిస్ట్రేషన్ అయ్యాయని ఆరోపణలు చేశారు. వాళ్లది రిజిస్ట్రేషన్ అయ్యింది. అయితే సామాన్య ప్రజలు ఎందుకు వేచి చూడాలి? ఇదెవరి అండదండలతో జరుగుతోంది? అని ప్రశ్నించారు.
మల్లా రెడ్డి లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు కనీస మానవ హక్కుల విషయంలో కూడా.. శ్రద్ధ చూపలేదని కవిత ఆరోపించారు. ప్రభుత్వ నిర్మాణాలైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వేలాది మంది నివసిస్తున్నప్పటికీ, వారికి రవాణా, కరెంట్, నీటి సరఫరా వంటి మౌలిక వసతులు సక్రమంగా లభించడం లేదని పేర్కొన్నారు.
Also Read: తెలంగాణ రైజింగ్ లక్షల కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ కలల ప్రాజెక్ట్
ఈ సమస్యలపై తెలంగాణ జాగృతి తరఫున న్యాయపోరాటం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లడానికి సిద్ధమని కవిత ప్రకటించారు. ప్రజల కోసం, వారి హక్కుల కోసం మేము వెనక్కితగ్గం. మేడ్చల్ ప్రజల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి కూడా బాగా తెలుసు. ఆయన ప్రత్యేకంగా టూర్ పెట్టి ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అని కవిత అన్నారు.