బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తనకు అందిన సిట్ (SIT) నోటీసులపై స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మునిసిపల్ ఎన్నికల సన్నద్ధత దృష్ట్యా తాను విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేస్తూ సిట్ అధికారులకు లేఖ రాశారు. మొత్తం ఏడు కీలక అంశాలతో కూడిన ఈ లేఖలో తన అభ్యంతరాలను, నిబంధనలను ఆయన వివరించారు.
ఎన్నికల బిజీలో కేసీఆర్
రాష్ట్రంలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే పనిలో తాను అత్యంత బిజీగా ఉన్నానని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. పార్టీ బాధ్యతలు, వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నందున రేపటి విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత విచారణకు అనువైన మరో తేదీని ఖరారు చేయాలని ఆయన కోరారు.
విచారణాధికారులకు కేసీఆర్ తన నివాసం నుంచే సహకరిస్తానని వెల్లడించారు. ముఖ్యంగా సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం.. ఒక వ్యక్తిని కచ్చితంగా ఫలానా చోటే విచారించాలని ఎక్కడా లేదని ఆయన గుర్తుచేశారు. చట్టప్రకారం 65 ఏళ్లు పైబడిన వ్యక్తులను వారు కోరిన చోటే విచారించాల్సి ఉంటుందని.. కాబట్టి తనను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లోనే విచారించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తనకు పంపే ఎలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్ అడ్రస్ కే పంపాలని సూచించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా తనకు చట్టం పట్ల గౌరవం ఉందని, ఒక బాధ్యత గల పౌరుడిగా విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ అనివార్యతలను పరిగణనలోకి తీసుకొని విచారణను వాయిదా వేయాలని కోరారు. తన వయస్సు, హోదా మరియు చట్టపరమైన వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని సిట్ అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ALSO READ: Medaram Jatara: మేడారం జనారణ్యం.. వనదేవత సమ్మక్క ఆగమనం.. గాల్లోకి ఎస్పీ కాల్పులు..