దక్షిణ భారత కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష భక్తజనం ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. వనదేవత సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి జనారణ్యంలోకి ప్రవేశించడంతో మేడారం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాలు, శివసత్తుల పూనకాలు, డప్పు వాయిద్యాల హోరుతో దండకారణ్యం మార్మోగిపోతోంది.
బుధవారం సారలమ్మ గద్దెపైకి చేరగా, గురువారం సాయంత్రం ప్రధాన ఘట్టమైన సమ్మక్క తల్లి ఆగమనం అత్యంత వైభవంగా జరిగింది. చిలకలగుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పూజారులు కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని తీసుకుని కిందకు బయలుదేరారు. వనం వీడి తల్లి జనంలోకి రాగానే భక్తుల కోలాహలం మిన్నంటింది. తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడటంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి.
చిలకలగుట్ట నుంచి దిగివచ్చిన సమ్మక్క తల్లికి తెలంగాణ ప్రభుత్వం తరపున ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఘన స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం ఎస్పీ తన తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి తల్లికి వందనం సమర్పించారు. చిలకలగుట్ట ప్రధాన ద్వారం వద్ద మరోసారి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతించారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు తరలివచ్చిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
వనదేవత ఆగమన వేడుకలో జిల్లా కలెక్టర్ దివాకర, డీఎఫ్వోతో పాటు ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయాల మధ్య అమ్మవారు గద్దెల వైపు సాగుతుండగా, అధికారులు కేరింతలు కొడుతూ భక్తులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. రాత్రి 8:30 గంటల తర్వాత తల్లి పూర్తిస్థాయిలో గద్దెపైకి చేరుకోనుండటంతో, గద్దెల ప్రాంగణం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సుమారు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలు, రవాణా సౌకర్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచారు. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం సమ్మక్క తల్లి గద్దెపైకి చేరడంతో జాతరలో అసలైన పండగ వాతావరణం సంతరించుకుంది.
ALSO READ: Medaram Jatara: మేడారంలో అద్భుతం.. నేను పచ్చి రక్తం తాగుతా, సమ్మక్క చెప్పిన జోస్యం వింటే పూనకాలే..