KCR : దేశ రాజధాని ఢిల్లీలో భారత్ రాష్ట్ర సమితి జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సర్దార్ పటేల్ రోడ్లో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 12.47 గంటలకు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
సీఎం కేసీఆర్ సోమవారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో చేయాల్సిన మార్పులు సూచించారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి దిశానిర్దేశం చేశారు.
ఢిల్లీ వసంత్ విహార్లో బీఆర్ఎస్ కోసం నిర్మిస్తున్న శాశ్వత కార్యాలయ భవనంలో జరుగుతున్న పనులను కేసీఆర్ పరిశీలించారు. పార్టీ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం పూజలు మొదలయ్యాయి. రెండోరోజు రాజశ్యామల, నవచండీయాగాల్లో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు.
కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని ఆహ్వానించారు. వివిధ పార్టీల ఎంపీలు, నాయకులకు ఆహ్వానాలు పంపారు. తొలుత బీఆర్ఎస్ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదే సమయంలో వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరతారని తెలుస్తోంది.
ఢిల్లీ సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫెక్సీల ఏర్పాటుకు అనుమతులు లేవని ఢిల్లీ నగరపాలక సంస్థ సిబ్బంది తొలగించారు. తెలంగాణ భవన్, తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.