KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను గ్రామస్తులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో ముచ్చటించి.. వారికి ధైర్యం చెబుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు ఎల్లప్పుడూ అన్ని కాలాలూ అనుకూలంగా ఉండవని.. కొన్ని సమయాలలో కష్టాలు ఎదురవుతాయని..వాటికి భయపడకూడదని అన్నారు. మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని… తెలంగాణ పల్లెలకు మంచి రోజులు తిరిగి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతవరకు ప్రజలు ఎట్టి పరిస్థితులలోనూ అధైర్య పడకూడదని సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో ప్రజలు స్వయంశక్తితో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం కొత్తగా ఎన్నికవుతున్న సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు ఏర్పాటు చేసుకుని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె పురోగతికి కృషి చేయాలి’ అని కేసీఆర్ అన్నారు.
ఎవరో ఏదో చేస్తారని.. ఏదో ఇస్తారని… ఆశలు పెట్టుకొని నష్టం తెచ్చుకోవద్దని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక, ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాలని కేసీఆర్ గ్రామస్తులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కేసీఆర్కు తమ మద్దతు తెలిపారు.
ALSO READ: Kokapet Lands: కోకాపేట భూవేలం పాట క్లోజ్.. HMDAకు మొత్తం ఆదాయం అక్షరాల రూ.3862.8 కోట్లు