
KCR : దేశంవ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలన్న లక్ష్యంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతానికి మహారాష్ట్రపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. తాజాగా ఔరంగాబాద్లోని జబిందా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పార్టీ లక్ష్యాలను మరోసారి వివరించారు. దేశంలో మార్పు తెచ్చేందుకే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని కేసీఆర్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఒక కులం, మతం, వర్గం కోసం ఆవిర్భవించింది కాదన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే లక్ష్యమన్నారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలోపు ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ మాదిరిగానే అభివృద్ధి చేస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తామని భరోసా ఇచ్చారు. ప్రతి ఎకరాకు సాగునీరు, ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. నాగ్పుర్లో పార్టీ శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. జడ్పీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. దేశంలో రైతురాజ్యం తీసుకురావడమే బీఆర్ఎస్ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు.
దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. పార్టీలు గెలవడం ముఖ్యం కాదని ప్రజల ఆకాంక్షలు గెలవడం ముఖ్యమన్నారు. దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందన్నారు. చైనా ప్రపంచాన్ని శాసించే స్థితికి చేరిందని.. సింగపూర్, కొరియా లాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీ మేకిన్ ఇండియా అంటారు కానీ దేశంలో ప్రతి చోటా చైనా బజార్లు ఉన్నాయన్నారు. మేకిన్ ఇండియా జోకైందని సెటైర్లు వేశారు.
దేశంలో ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశం కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.