SC Action Plan: కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 అమలుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ క్రింద ఖమ్మం జిల్లాకు 5 కోట్ల 16 లక్షలతో 540 యూనిట్ లను మంజూరు చేసిందని తెలిపారు. 90 శాతం సబ్సిడీతో లక్ష రూపాయల విలువ గల 256 ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలు, 70 శాతం సబ్సిడీతో 3 లక్షల రూపాయల విలువ గల 128 ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వాహనాలు, 60 శాతం సబ్సిడీ (5 లక్షల వరకు)తో 3 నుండి 7 లక్షల రూపాయలు విలువ గల 27 సోలార్ పంప్ కంట్రోల్ యూనిట్ లు, 40 వేల రూపాయల గల వేజ్ ఉపాధి శిక్షణ 103 మంది అభ్యర్థులకు, 15 వేల రూపాయల స్వయం ఉపాధి శిక్షణ 26 మంది లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 క్రింద ఆసక్తి, అర్హత గల ఎస్సీ నిరుద్యోగ యువతీ, యువకులు మార్చి 24 లోపు తమ దరఖాస్తులను ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. మార్చి 25న ఆన్లైన్ లో వచ్చిన దరఖాస్తులను ఈడీ ఎస్సి కార్యాలయం నోటీస్ బోర్డుపై అంటించి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
మార్చి 26న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన గల జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, అట్టి అభ్యర్థుల వివరాలను బ్యాంకులకు మార్చి 27 లోపు సమర్పించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ పోను మిగిలిన సొమ్ము బ్యాంకు రుణం ద్వారా ఏర్పాటు చేసి సంబంధిత యూనిట్లను గ్రౌండ్ చేసి ఏప్రిల్ 16 లోపు యుటిలైజేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ.వీ. వాహనాలు, వ్యవసాయ సోలార్ పంప్ సెట్ల యూనిట్లకు సంబంధించి బ్యాంకు లింకేజీతో అమలు చేస్తాం అన్నారు.ఏప్రిల్ 4 లోపు బ్యాంకు నుంచి రుణం మంజూరీకి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని, ఏప్రిల్ 7న ఎంపిక చేసిన అభ్యర్థులకు జిల్లా సొసైటీలు మంజూరి పత్రాలు జారీ చేస్తారని, ఏప్రిల్ 9న ఎంపిక చేసిన అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేస్తుందని అన్నారు. అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడతామని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ.డీ ఎస్సీ కార్పొరేషన్ నవీన్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, జిల్లా రవాణ అధికారి శ్రీనివాసరావు, ఎన్పిడిసిఎల్ ఎస్.ఈ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, ఎల్డిఎం రవిప్రసాద్ పాల్గొన్నారు.