MP Chamala: భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో వ్యవసాయ పద్దులపై జరిగిన చర్చలో భాగంగా రైతుల పక్షాన గళమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముకగా ఉన్న రైతులకు కేంద్ర బడ్జెట్ 2026-27 ఆశించిన స్థాయిలో లేదని, ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేలా ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
భారతదేశంలో దాదాపు 60% జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని, దేశంలోని మొత్తం ఉపాధిలో 50% వాటా ఈ రంగమే కల్పిస్తోందని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు ఆధారపడిన రంగం, దేశ జీడీపీ (GDP)కి కేవలం 16% నుండి 18% మాత్రమే సహకారం అందించడం తీవ్రమైన ‘నిర్మాణాత్మక అసమతుల్యత’కు నిదర్శనమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంపద పంపిణీలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందని, కానీ అన్నం పెట్టే రైతు రుణాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. ‘రైతులు చేసిన తప్పేంటి? వారికి అడిగే గొంతు లేదని కేంద్రం భావిస్తోందా?’ అని ఆయన ప్రశ్నించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలో వైఫల్యం, కనీస మద్దతు ధరకి చట్టబద్ధమైన గ్యారెంటీ కల్పించకపోవడంపై ఆయన కేంద్రాన్ని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కీలక డిమాండ్లను సభకు తెలిపారు. తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు పెరుగుతున్న నేపథ్యంలో, రైతులకు శాస్త్రీయ మద్దతు అందించడానికి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ప్రతిపాదిత విత్తన బిల్లులో తెలంగాణ సూచించిన సవరణలను పరిగణనలోకి తీసుకోవాలని.. విత్తనోత్పత్తికి కేంద్రం ఆర్థికంగా సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణకు రావాల్సిన వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తక్షణమే స్థాపించాలన్నారు. చివరగా.. అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కంటే స్వదేశీ రైతుల ప్రయోజనాలే ముఖ్యమని హితవు పలికారు. బడ్జెట్ను సవరించి, రైతు అనుకూల వైఖరితో ముందుకు సాగాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Also Read: తెలుగు పరీక్ష సరిగ్గా రాయలేదని పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య!