Kishan Reddy: తెలంగాణలోని స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేయడంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రం స్థానిక సంస్థల కోసం రూ. 11 వేల కోట్లకు పైగా నిధులను మంజూరు చేసిందని ఆయన వెల్లడించారు. గతంతో పోలిస్తే ఈసారి కేంద్రం నుంచి అందుతున్న నిధులు 80 శాతం పెరగడం విశేషమని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికేట్లు (UCs) సమర్పించిన వెంటనే మిగిలిన నిధులను కూడా విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నిధులు విడుదల చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడంలో జాప్యం చేయకూడదని ఆయన సూచించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది, ఇకనైనా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి కనీస వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. పంచాయతీలకు నేరుగా నిధులు అందుతున్న తరుణంలో, వాటిని మళ్లించకుండా గ్రామ వికాసానికి ఖర్చు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
Read Also: జర్నలిస్టుల అరెస్టులపై సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు.. తప్పు చేయకపోతే బ్యాంకాక్ పారిపోవడం ఎందుకు?