Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. గతంలో జూబ్లీహిల్స్ లో ఎప్పుడూ ఒక కార్పొరేటర్ స్థానాన్ని కూడా తమ పార్టీ గెలుచుకోలేదని గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు చాలా అరుదుగా ఉన్నాయన్నారు. అయినా మేము ఉన్నంతలో పూర్తి స్థాయిలో కృషి చేశాం. మా పార్టీ అక్కడ బలహీనంగా ఉన్నా కూడా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశాం అని ఆయన వివరించారు.
జూబ్లీహిల్స్ ఫలితాలపై స్పందిస్తూ, కాంగ్రెస్ విజయం సహజంగా వచ్చినదికాదనీ, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల కారణంగానే ఈ ఫలితం వచ్చిందనీ అన్నారు. ఎంఐఎం పూర్తి మద్దతు, భారీగా ఖర్చు చేసిన నిధులు, సమీకరించిన స్థానిక నెట్వర్క్ అన్నీ కలిసి కాంగ్రెస్ గెలిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం మద్దతు లేకపోయుంటే కాంగ్రెస్ పార్టీకి ఈ గెలుపు సాధ్యం కాదు. ఇది ప్రజా తరఫున వచ్చిన సాధారణ విజయం కాదు అని ఆయన విమర్శించారు.
అదే సమయంలో, బీజేపీ మాత్రం ఓటమిని అంగీకరిస్తూ ప్రజా తీర్పుకు శిరసావహిస్తున్నామని చెప్పారు. ఎక్కడ లోపాలున్నాయి, ఎక్కడ నుంచి పాఠాలు నేర్చుకోవాలి అనేది మా అంతర్గత చర్చల్లో పరిశీలిస్తాం అని ఆయన తెలిపారు.
జూబ్లీహిల్స్లో ఈసారి ఎదురైన మరో ప్రధాన సమస్య ఓటర్ల జాబితాపైనే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దఎత్తున పేర్లలో తప్పులు, మార్పులు, తొలగింపులు చోటుచేసుకున్నాయని, దీనిపై బీజేపీ త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. ఓటరు జాబితా తప్పులతో నిండిపోయింది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఎన్నిక జరుగడం సరైంది కాదు. దీనిపై మేము అధికారికంగా కంప్లైంట్ చేస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
జిహెచ్ఎంసీ ఎన్నికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. టార్గెట్ స్పష్టం చేస్తూ, “మా లక్ష్యం జిహెచ్ఎంసి మేయర్ పదవి గెలుచుకోవడం. మేము దానిపై పూర్తి స్థాయి దృష్టి పెడుతున్నాం, అని తెలిపారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనేక డివిజన్లలో డిపాజిట్లు కూడా రాలేదని గుర్తుచేసి, ప్రస్తుతం వారికి వచ్చే ఊపే త్వరలో ఆగిపోతుందని ఆయన సూచించారు.
బీహార్ ఎన్నికల ఫలితాలపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వానికి బీహార్ ప్రజలు భారీ ప్రశంసల రూపంలో ఓట్లు అందించారని చెప్పారు. మేమే ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని బీహార్ ప్రజలు BJPకి అందించారు. కాంగ్రెస్ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలన్నీ ప్రజలే ఖండించారు అని అన్నారు.
Also Read: మరోసారి అక్షరాల నిజమైన బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్
చివరిగా, కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని ఆయన తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. దేశ ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వుల పాలయ్యారు అని తీవ్ర విమర్శలు చేశారు.