Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, హైదరాబాద్ పారిశ్రామిక విధానాలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో మిగులు నిధులతో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిందని ఆయన అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అప్పుల బాటలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోందని ఆరోపించారు.
ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా భూములు అమ్మాల్సిన దుస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. భూములు అమ్మకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టు గట్టిగా అడ్డుకుందని గుర్తుచేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వంలో అదే ధోరణి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్లో భారీ భూ దందాకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని, పారిశ్రామిక వాడలను నగరం నుంచి తరలించి ఆ భూములను కమర్షియల్ కాంప్లెక్స్లకు అప్పగించాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. 9 వేల ఎకరాల భూమిని పారిశ్రామిక జోన్ నుంచి కమర్షియల్ జోన్గా మార్చేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 27ను తీసుకొచ్చిందని, దీనిపై పారిశ్రామిక వేత్తలు, కార్మికులతో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు.
ఇలాంటి కీలక విధాన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులతో చర్చించి అధ్యయనం చేయాల్సి ఉందని కిషన్ రెడ్డి సూచించారు. గతంలో ఒక మేధావిగా పేరున్న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును గుదిబండగా మార్చారని విమర్శించారు. ఇప్పుడు మరో మేధావి వచ్చారని, తాను ఎక్స్పర్ట్నని రేవంత్ రెడ్డి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కానీ ఈ విధానాలు పారిశ్రామిక వేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా మాత్రమే ఉంటున్నాయని ఆరోపించారు.
హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో పని చేస్తున్న లక్షలాది కార్మికుల భవిష్యత్తు గురించి సీఎం ఒక్కసారి కూడా ఆలోచించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ORR వెనుకభాగంలో, బయట ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎంతోకాలంగా భూముల బదలాయింపు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కానీ పారిశ్రామిక వేత్తలకు మాత్రం ప్రత్యేక న్యాయం జరుగుతోందని, ఇది స్పష్టమైన అవినీతి జీవోగా ఆయన అభివర్ణించారు.
రైతులకు ఒక న్యాయం, పరిశ్రమల వారికి మరో న్యాయమా? అంటూ ప్రశ్నించిన ఆయన, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యల కారణంగా అనేక కంపెనీలు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయాయని ఉదాహరణగా చెప్పారు. అదే పరిస్థితి హైదరాబాద్కు రాకూడదంటే సమగ్ర అధ్యయనం అవసరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయంపై స్టడీ చేశారని, డబ్బులు ఎలా దిగువ నుంచి పైకి తీసుకు రావాలోనే అధ్యయనం చేశారా అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో జీవో నెంబర్ 27 తీసుకురావడం నగరంపై మరింత భారాన్ని మోపినట్టేనని అన్నారు. ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని, జోనింగ్ విధానంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలపైనా కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అహంకారంతో హిందూ దేవుళ్లను కించపరచడం తగదని అన్నారు. వెంటనే హిందూ సమాజానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి హిందూ దేవుళ్లను కించపరచడం అలవాటుగా మారిందని ఆరోపించారు.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసినట్టు గుర్తుచేసిన ఆయన, ఇతర మతాలపై ఇదే విధంగా మాట్లాడే ధైర్యం కాంగ్రెస్కు ఉందా అని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ కూడా హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ మాట్లాడారని, అందుకే ఆయనకు హిందువులు తగిన బుద్ధి చెప్పారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ హిందూ వ్యతిరేక పార్టీలేనని ఘాటుగా వ్యాఖ్యానించారు.
దర్శకుడు రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలపైనా స్పందించిన కిషన్ రెడ్డి, హిందూ దేవుళ్లపై ఏ వ్యాఖ్యలు చేసినా అవి తప్పేనని, అయితే ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి మాత్రమేనని చెప్పారు. కానీ సీఎం స్థాయిలో ఉన్న నాయకుడు ఇలా మాట్లాడటం సమాజంలో తీవ్ర విభేదాలు సృష్టిస్తుందని హెచ్చరించారు.