తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి.. వారికిచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం వేసిన కేకే కమిటీపై పెదవి విరుస్తున్నారు ఉద్యమకారులు. కే కేశవరావును పక్కా రాజకీయ నాయకుడిగానే చూస్తున్నారంతా. ఒక్క కోదండరామ్ తప్ప.. ఈ కమిటీలో మెంబర్లుగా ఉన్న అద్దంకి దయాకర్, పొన్నం ప్రభాకర్, మోతె శోభన్రెడ్డి వీరందరినీ రాజకీయ నాయకుల కోటాలోనే చూస్తున్నారు. కేకే తో సహా వీరందరికీ తెలంగాణ ఉద్యమానికి పెద్దగా సంబంధం లేదని, వీరితో తగిన న్యాయం జరగదనే అభిప్రాయంతో వారున్నట్టు తెలిసింది. ఇందులో ఒక్క కోదందరామ్పైనే పార్టీలకతీతంగా నమ్మకం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది.
ఉద్యమకారుల సంఘాలు, ఉద్యమకారులంతా ఆయన వద్దకే బారులు కట్టారట. మమ్మల్ని గుర్తించండి.. ఇదిగో మేం ఉద్యమంలో పాల్గొన్న ఆనవాళ్లు.. అని విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారట. కేకేపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. కేకేకు ప్రాధాన్యత దక్కుతూ వస్తుందని .. ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మీకి ఇటీవల మహిళా కమిషన్ చైర్మన్గా ఇవ్వడాన్ని ఉదహరిస్తూ వస్తున్నారు. కేకే అంటే.. కనీసం రాజకీయ అనుభవం ఉంది.. కానీ ఆయన కూతురుకు పదవులివ్వడం ఎందుకు? అనే కోణంలో ప్రశ్నించారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ కమిషన్ మెంబర్లలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ ఉండటం. దీన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా కొంచెం అతి చేసి ప్రచారం చేసింది. ఏమని? ఉద్యమకారులకు సర్కార్ పెద్దపీట వేస్తున్నదని.
ఇదిగో శంకరమ్మకు పదవి ఇచ్చిందని ప్రచారం చేసుకున్నది. దీన్ని చాలా మంది ఉద్యమకారులు ప్రశ్నించారు. ఆమెకు ఇస్తే.. మహిళా కమిషన్ చైర్మన్గా ఇచ్చేదుండే. మెంబర్గా ఇచ్చి అదేదో పెద్ద పదవిగా భావిస్తున్నారా? అనే నిలదీత నుంచి మొదలై.. అసలు గద్వాల విజయ లక్ష్మికి ఎందుకు చైర్మన్ పదవి ఇచ్చారు? ఆమె ఏం చేసిందని? మొన్నటి దాకా కేసీఆర్ పాలనలో జీహెచ్ఎంసీ మేయర్గా పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు మళ్లీ పార్టీ మారగానే పదవా? దీనికి కారణం… కేకే ఫైరవీ చేయడమే. అందుకే కేకే ఎక్కడున్నా.. ఇలా ఆయనకు, ఆయన కుటుంబానికి పదవులొస్తాయి.. ఉద్యమాలతో, నిబద్దతతో పనిలేదు.. అని సెటైర్లు వేయడం ప్రారంభించారు.
ఆలోపే ఈ కేకే కమిటీ వేయడంతో మరింత భగ్గుమన్నారంతా. అసలు కేకే కు ఏం తెలుసు? ఉద్యమం గురించి? ఆయన మాకు న్యాయం చేస్తాడని మాకైతే నమ్మకం లేదు..? అని బాహాటంగానే నిలదీసే పరిస్థితి వచ్చిందక్కడ. దీంతో ఆ కమిటీలో ఉన్న కోదండరామ్ మీదే నమ్మకం పెట్టుకున్నారంతా. హైదరాబాద్తో పాటు ..తెలంగాణ వ్యాప్తంగా ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు. దాదాపు ఉద్యమకారులంతా కోదండరామ్కు ముఖ పరిచయమే. ఆయనైతేనే తగిన విధంగా మేలు చేస్తాడు..? గుర్తింపు దక్కుతుంది.. ప్రభుత్వంలో మేలు జరుగుతుంది.. అనే భావనకు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పలు మార్లు సమావేశమైంది కేకే కమిటీ.
ఉద్యమకారులను పలు కేటగిరీల వారీగా గుర్తించాలని, ఏ కేటగిరీకి ఎలాంటి పథకాలు అమలు చేయాలి? అనేదానిపై ప్రభుత్వానికి ఓ సూచన చేసేందుకు అందరితో చర్చలు జరుపుతున్నారు. ఆ లోపు ఉద్యమకారులందరినీ గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు. అంతా కోదండరామ్ నేతృత్వంలోనే సాగుతున్నట్టుగా ఉంది అక్కడ వ్యవహారం. కేకే ఉత్త ఉత్సవ విగ్రహంగానే భావిస్తున్నారంతా. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కోదండరామ్పైనే భారం వేసినట్టు తెలిసింది.
ఇక ఈ కమిటీలో మహిళ ఉద్యమకారులకు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి విద్యార్థి సంఘాల ప్రతినిధులకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల కూడా సర్కార్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు చాలా మంది.