Kishan Reddy: స్వేచ్ఛ బ్యూరో: రేవంత్ సర్కార్ కు మజ్లిస్ అంటే భయమా? ప్రేమా? లేక రెండూ ఉన్నాయా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఓవైసీలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చురకలంటించారు. నాంపల్లిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆయన కలియతిరిగారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భూములు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కమీషన్ల కోసం ఆరాటపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇందుకోసం సామాన్య ప్రజల జీవనోపాధిని బలిచేస్తోందని కేంద్ర మంత్రి విమర్శించారు. అదే సమయంలో మజ్లిస్ పార్టీని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడటం లేదన్నారు.
రేవంత్ సర్కార్.. సెలక్టివ్ గవర్నెన్స్(పక్షపాత పాలన)కు హైడ్రా ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. సామాన్య ప్రజల విషయంలో మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. సల్కం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బారిష్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ విషయంలో మాత్రం మౌనంగా ఉంటూ.. మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ హైకోర్టు పలుమార్లు జోక్యం చేసుకుని.. ప్రభుత్వ జాప్యంపై చీవాట్లు పెట్టినా ప్రభుత్వ తీరులో మార్పులేదని ధ్వజమెత్తారు. హైడ్రా, విద్యాశాఖ సహా పలు శాఖల నుంచి వివరాలు కోరినా.. సామాన్య ప్రజల విషయంలో చూపే తొందరపాటును.. ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేదని విరుచుకుపడ్డారు.
Also read: Fertilizer App: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా బుకింగ్లో సంచలనం!
కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీని యావత్ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా భావిస్తున్నట్లుగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది పూర్తిగా తప్పు అని, హైడ్రా చర్యల వల్ల పేద ముస్లింల ఇళ్లు కూడా కూల్చివేశారని, వారి జీవనోపాధి దెబ్బతిందన్నారు. ఆ సమయంలో వారి తరఫున మజ్లిస్ గానీ, కాంగ్రెస్ గానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. కానీ ఓవైసీ సోదరుల ఆస్తుల విషయంలో మాత్రం ఈ రెండు పార్టీలు ఒకే ఆలోచనతో వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముస్లిం సమాజంపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమలేదని, తమ మిత్రుడైన ఓవైసీకి ఇబ్బంది కలగకూడదన్నట్లుగా, మజ్లిస్ ప్రయోజనాలకు కాపాడేలా.. రేవంత్ సర్కారు వ్యవహరిస్తోందని స్పష్టంగా అర్థమవుతోందని చురకలంటించారు. ఫాతిమా విద్యాసంస్థల వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలను, మజ్లిస్ ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేసిందన్నారు.
ఈ ఇద్దరికీ.. తాము ముస్లిం సమాజానికి ప్రతినిధులమని చెప్పుకునే హక్కులేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పేదల కోసం బుల్డోజర్లతో విధ్వంసం చేపడుతుంటే కాంగ్రెస్-మజ్లిస్ రాజకీయ వ్యవస్థ కోసం నిరంతర రక్షణ వ్యవస్థ ఉంటోందని వ్యాఖ్యానించారు. ప్రజల భూములు, చెరువులు, ప్రభుత్వ ఆస్తులు తెలంగాణ ప్రజల సొత్తు అని, రాజకీయ అండదండలు ఉన్నవారి వ్యక్తిగత ఆస్తులు కావన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలను చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అనే సూత్రాన్ని అమలుచేయాలని స్పష్టంచేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయ. అన్న ప్రభుత్వ తీరుతో.. ప్రజల్లో సర్కారుపై విశ్వాసం తగ్గుతుందని, వీటన్నింటిని గమనిస్తున్న ప్రజలకు త్వరలోనే ప్రభుత్వానికి దిమ్మదిరిగే సమాధానం ఇస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also read: Zaheerabad: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. డాక్టర్లు లేక నర్సుల డెలివరీకి పసికందు మృతి!