KTR: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. బుధవారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ చేసిన వ్యాఖ్యలపై సూటిగా బదులిచ్చారు కేటీఆర్. పవన్ కళ్యాణ్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలని, తెలంగాణ కచ్చితంగా తెలంగాణ భూమి పుత్రుల జాగీరని చెప్పారు.
జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ భూమి పుత్రుల జాగీరే, ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కర్లేదన్నారు. 100 శాతం ఈ నేల కోసం కష్టపడ్డామని, పోరాటాలు, త్యాగాలు, నెత్తురుతో తడిచిన నేల అని వివరించారు. ముమ్మాటికీ తెలంగాణ ఈ భూమి పుత్రులు, ఇక్కడున్న నాలుగు కోట్ల మంది జాగీరేనని విడమరిచి చెప్పారు. మీరు ఇక్కడే ఉండాలని, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయని, మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయని ఎవరొద్దన్నారని ప్రశ్నించారు.
గడిచిన 10, 12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందా? ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నామని అన్నారు. ఇంకొన్ని రోజులైతే జనగణమన పాడరని, మాకు జనగణమన నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు.
ఈ గడ్డపై మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి-కేటీఆర్
నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల అని, కమ్యూనిస్టులు కదంతొక్కిన నేల, మాకు పోరాటాలు, యుద్ధాలు, త్యాగాలు కొత్త కాదన్నారు. వాటి గురించి మాకు జాతీయ భావన ఉందని, దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉందన్నారు. పవన్ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తామన్నారు.
కళాకారుడు, నటుడిగా అభిమానిస్తామని, సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతామన్నారు. హైదరాబాదీ బిర్యానీ పెడతామని, మా సెక్రటేరియట్లో కూర్చొని పెత్తనం చేస్తాం అంటే ఒప్పుకోమన్నారు. దేశంలో ఏ నాయకుడు, నాయకురాలు పార్టీ పెట్టవచ్చని, పోటీ చేయవచ్చన్నారు. దేశంలో అందరికీ హక్కు ఉందని, రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన హక్కు అని అన్నారు.
ఇందులో ఏమాత్రం అనుమానం లేదన్నారు. ఏ ప్రాంతంలో మీరు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంత ఆకాంక్షలు, పరిస్థితులు, ఆ ప్రాంత ప్రజల మనోభావాలు, వారి పోరాటాలు, త్యాగాలు మీరు తెలుసుకోవాలని, వారి మీద అభిమానం ఉండాలన్నారు. కొత్తగా జనసేన పోటీ చేసేదేముంది? 2023 లో పోటీ చేయలేదా? మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు కదా? కొత్తగా చేసేదేముందని ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు.
ALSO READ: పవన్ సభ వెనుక.. కేటీఆర్, హరీశ్ రావు కుట్ర.. కాంగ్రెస్ నేత సంచలనం
మిమ్మల్ని ఎవరైనా ఆపుతున్నారా? 2018లో చంద్రబాబు వచ్చి పోటీ చేశారని, 2023 లో మీరు పోటీ చేశారని, చేయండి ఎవడొద్దంటున్నారని ధ్వజమెత్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడాలన్నారు. జనసేనను ఎవరు అడ్డుకుంటున్నారు? ఏదో ఊహాజనితమైన ప్రపంచాన్ని సృష్టించుకుని మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు?
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి సభ పెడతామని ఎవరన్నారు? గతంలో తెలంగాణ ఏర్పడినప్పుడు విభజించిన పద్ధతి నచ్చలేదని ఒకాయన అంటారని, తల్లిని చంపి బిడ్డను బతికించాలని మరొకరు అంటున్నారని, తెలంగాణ ఏర్పడడం ఇష్టంలేక ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారని అన్నారు.
11 రోజులు అన్నం ముట్టకుండా ఉంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉందా? మీటింగ్ పెడదామంటే అడ్డుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, ఏమన్నా అనాలనుకుంటే వాళ్ల అనాలని అన్నారు.