Gajjel Kantham: గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబం వల్లే రాలేదని, అది నాలుగు కోట్ల ప్రజల సుదీర్ఘ పోరాట ఫలమని స్పష్టం చేశారు.
కేసీఆర్ చేసింది దొంగ దీక్ష
తెలంగాణ రాకపోతే కేసీఆర్ వందేళ్లయినా ముఖ్యమంత్రి అయ్యేవారు కాదన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసింది దొంగ దీక్ష అని, ఇడ్లీలు తింటూ గ్లూకోజ్ ఎక్కించుకున్నారని ఎద్దేవా చేశారు. నాడు చనిపోయిన 1200 మంది అమరవీరులలో కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాలను చూసి చలించిపోయిన సోనియా గాంధీనే తెలంగాణ ఇచ్చారని, కానీ రాష్ట్రం వచ్చాక అది ఒకే కుటుంబం పాలైందని మండిపడ్డారు.
నాటి ఉద్యమ వ్యూహాలు నావే!
రాష్ట్ర సాధన కోసం అన్ని కుల సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసి, ఉమ్మడిగా ఉద్యమించింది తామేనని గజ్జెల కాంతం గుర్తుచేశారు. నాడు టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలను ఏకం చేసి 70 మంది ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించింది నేనేనని చెప్పారు. చంద్రబాబు నాయుడి పాదయాత్రను అడ్డుకుని, ఆయనతో పాటు వైఎస్ జగన్తో ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు రాయించింది కూడా తానేనని వెల్లడించారు. 2004, 2009 ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ను నమ్మలేదు కాబట్టే పొత్తులు పెట్టుకున్నా తక్కువ సీట్లు వచ్చాయని గుర్తుచేశారు.
పవన్ కళ్యాణ్ వెనుక బీఆర్ఎస్ కుట్ర
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెట్టడం వెనుక కేటీఆర్, హరీష్ రావుల కుట్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించడానికి మోదీ, కేసీఆర్, పవన్ కలిశారని విమర్శించారు. ఒకప్పుడు తెలంగాణ దృష్టి పడితే కోనసీమ అపవిత్రమవుతుందన్న పవన్, ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే, ఆస్తులు తగలబెడతామంటూ కేటీఆర్ శాంతిభద్రతలను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!