KTR comments: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ, ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కాలం తర్వాత అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సీటు వద్దకు వెళ్లి కరచాలనం చేయడం, ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న ఈ ఇద్దరు నేతలు సభలో ఇలా కలవడం అనూహ్యంగా మారింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ కావడంతో పాటు, రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాయి.
సభలో జరిగిన ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి చేసిన షేక్ హ్యాండ్పై వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల రాష్ట్ర ప్రజలందరికీ గౌరవం ఉంది. సభలో కేసీఆర్ని కలిసేంత సంస్కారం సీఎంకు ఉంటే చాలు. కానీ అదే సంస్కారం బయట మాటల్లోనూ కనిపిస్తే ఇంకా బాగుంటుంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు పరస్పరం పలకరించుకోవడం మంచి విషయమేనని, అలాంటి సంస్కృతి ప్రజాస్వామ్యంలో అవసరమని ఆయన అన్నారు.
సభలో కరచాలనం చేయడం ఒక విషయం అయితే, బయట రాజకీయ వ్యాఖ్యల్లో కూడా అదే స్థాయి సంస్కారం పాటించాలని ఆయన సూచించారు. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి రూపురేఖలపై, ముఖ్యంగా గడ్డం, మీసాల అంశంపై కూడా కేటీఆర్ సెటైర్లు వేశారు.
గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ కారు. గడ్డాలు పెంచడం ఈజీ, కానీ పాలన చేయడం కష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో పాటు, రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. సీఎం గడ్డం మీసాలు లేవని నన్ను కాదు, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీలను కూడా అన్నట్టు మాట్లాడారు అంటూ విమర్శించారు.
ఇక్కడితో ఆగకుండా, వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లిన కేటీఆర్, చదువులు, కుటుంబ నేపథ్యంపై కూడా సెటైర్లు వేశారు. నేను ఆంధ్రాలో చదివితే తప్పా? కానీ అల్లుడిని మాత్రం ఏపీ నుంచి తెచ్చుకున్నారు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Also Read: ఈ జీవో ఎక్కడిది..? కృష్ణా నదీ జలాల వివాదంలో.. BRS బాగోతాన్ని బయటపెట్టిన ఉత్తమ్
మొత్తంగా చూస్తే, సభలో జరిగిన ఒక సాధారణ కరచాలనం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కలయిక మర్యాదపూర్వకమా, రాజకీయ సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలు ఈ అంశాన్ని మరింత రాజకీయ రంగు పులుమేలా చేశాయి. శీతాకాల సమావేశాల మధ్యలో చోటుచేసుకున్న ఈ ఘటన, రాబోయే రోజుల్లో అసెంబ్లీ లోపల, బయట రాజకీయ చర్చలకు కేంద్రబిందువుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.