Uttam Kumar Reddy: ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా నిర్వహించిన చిట్చాట్.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నుంచి మేడిగడ్డ పునర్నిర్మాణం, కృష్ణా జలాల వాటా వరకు పలు కీలక అంశాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారాలకు గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి, వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని ఉత్తమ్ తెలిపారు. మేమంతా కలిసి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో అడిగాం. రాజకీయాలకు అతీతంగా మానవతా కోణంతో వ్యవహరించాం అని మంత్రి చెప్పారు. రాజకీయ భేదాలు ఉన్నా ఆరోగ్య విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని పేర్కొన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ పునర్నిర్మాణంపై కూడా ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ పనుల్లో లోపాలపై ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. పునర్నిర్మాణానికి సంబంధించి పలు సాంకేతిక పరీక్షలు, ఇతర అవసరమైన అంశాలకు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించిందని తెలిపారు. మేడిగడ్డ పునర్నిర్మాణ పనులకు డెడ్లైన్ కూడా పెట్టాం. ఇక ఆలస్యం లేకుండా త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి అని స్పష్టం చేశారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ, భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంపై ఉత్తమ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే డిమాండ్ చేస్తోందన్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు. మా డిమాండ్ 90 టీఎంసీలే. మేమెప్పుడూ మా డిమాండ్ నుంచి వెనక్కి తగ్గలేదు, తగ్గే ప్రసక్తే లేదు అని తేల్చిచెప్పారు. 45 టీఎంసీల అంశాన్ని బీఆర్ఎస్ పార్టీనే ప్రజల్లోకి తీసుకువచ్చిందని, అది పూర్తిగా వక్రీకరణ అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పునాదుల మీదే రాజకీయాలు చేస్తోందని ఉత్తమ్ విమర్శించారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది నిజమవుతుందని వారు భావిస్తున్నారు. కానీ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు అని అన్నారు. బీఆర్ఎస్ నేతలు అతి తెలివితో వ్యవహరిస్తూ వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తాను ఇరిగేషన్ మంత్రిగా ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా ఎందుకు లేఖ రాస్తానని ప్రశ్నించారు. కృష్ణా వాటాలపై సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC)కు రాసిన లేఖలోని ఒక పేరాగ్రాఫ్ను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. CWC 45 టీఎంసీలపై సబ్జుడీస్ ఉందని, తమ చేతిలో ఏమీ లేదని చెబితే, కనీసం మీ పరిధిలో ఉన్న మిగతా 45 టీఎంసీలైనా ఇవ్వాలని నేను అడిగాను. దాన్ని వక్రీకరించి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ప్రచారం చేయడం దురుద్దేశపూరిత చర్య అని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రధానమని, కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డ పునర్నిర్మాణం, కృష్ణా జలాల వాటా, సాగునీటి భద్రత అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోందని చెప్పారు. అబద్ధాల ప్రచారాలను నమ్మకుండా ప్రజలు వాస్తవాలను గమనించాలని మంత్రి పిలుపునిచ్చారు.