KTR Letter Amit Shah: తెలంగాణలో దిగజారుతున్న శాంతిభద్రతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ ఆర్థిక లావాదేవీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. కేఎల్ఎస్ఆర్ (KLSR) ఇన్ఫ్రాటెక్ అనే సంస్థకు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడంపై సీబీఐ, ఈడీ, ఎస్ఎఫ్ఐఓ వంటి కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. దివాలా ప్రక్రియలో ఉన్న కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ. 2,500 కోట్ల విలువైన సాగునీటి తాగునీటి ప్రాజెక్టులతో పాటు యంగ్ ఇండియా స్కూల్ పనులను అప్పగించారని లేఖలో ఆరోపించారు. ఈ కంపెనీ రేవంత్ రెడ్డికి బినామీ అని ఆయన వాడిన వాహనం ఈ సంస్థ పేరుతోనే రిజిస్టర్ అయిందని ఆధారాలను ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి తన బినామీ కంపెనీని కాపాడుకునేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చి సాక్ష్యాధారాలను తారుమారు చేయిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. సేకరించిన కీలక పత్రాలు మాయమయ్యాయని ప్రభుత్వ అధికారులు కోర్టులో చెప్పడం దారుణమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని విచారణ సంస్థలను పోలీసు వ్యవస్థను నమ్మే పరిస్థితి లేదని సాక్ష్యాధారాలను ముఖ్యమంత్రి స్వయంగా మాయం చేయిస్తున్నారని ఆరోపించారు. నేషనల్ లా ట్రిబ్యునల్ (NCLT) విచారణలో కూడా రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని పక్షపాతం లేని విష్పాక్షిక విచారణ జరగాలని విజ్ఞప్తి చేశారు.
కేఎల్ఎస్ఆర్ కంపెనీ అంశంలో నిజాలు నిగ్గు తేల్చాలని గతంలో సుప్రీం కోర్టు సూచించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ గుర్తు చేశారు. దివాలా తీసిన కంపెనీకి అడ్డగోలుగా పనులు అప్పగించడం వెనుక భారీ మనీ లాండరింగ్ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న ఈ వ్యవహారంపై కేంద్ర ఏజెన్సీలు తక్షణమే స్పందించాలని కోరారు. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా అమిత్ షా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఈ లేఖ ప్రతులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్కు కేటీఆర్ పంపించారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా ఫోరెన్సిక్ ఆధారాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అనుచిత లబ్దిని అరికట్టాలని దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాలని కోరారు. తెలంగాణలో వ్యవస్థల స్వతంత్రతను కాపాడటం కోసం కేంద్రం కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ తన లేఖలో స్పష్టం చేశారు.
Read Also: LPG Shortage India: దేశంలో వంటగ్యాస్ కొరత లేదు.. పానిక్ బుకింగ్స్ వద్దు.. కేంద్రం విజ్ఞప్తి!